పాస్పోర్టు కష్టాలకు చెక్, నో వెరిఫికేషన్,ఎక్కడినుంచైనా అప్లయి చేసుకోవచ్చు
ఇకపై పాస్పోర్టు మరింత సులువు కానుంది, ఎటువంటి వెరిఫికేషన్ లేకుండానే మీచేతికి అందనుంది. ఎక్కడినుంచైనా అప్లయి చేసుకోవచ్చు
పాస్పోర్టు దరఖాస్తు కష్టాలకు ఇక చెక్ పడినట్టే. ఇప్పుడు కూర్చున్న చోటు నుంచే ఫింగర్ టిప్ ద్వారా పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా పాస్పోర్టు కోసం దరఖాస్తు చేయవచ్చు. దీనికి సంబంధించిన 'పాస్పోర్ట్ సేవా యాప్'ను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆవిష్కరించారు.ఈ యాప్ ద్వారా ఇకపై మొబైల్ ఫోన్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్పోర్ట్ సేవా దినోత్సవం సందర్భంగా సుష్మా స్వరాజ్ దేశంలోని పాస్పోర్టు సేవా కేంద్రాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదికారులను ఉద్దేశించి మాట్లాడారు. పాస్పోర్టులను పొందే ప్రక్రియ ఇకపై మరింత సులువవుతుందని చెప్పారు.

పాస్పోర్టు సేవా యాప్
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి పాస్పోర్టు సేవా యాప్ డౌన్లోడ్ మొబైల్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత అక్కడ కనిపించే అంశాలను ఓసారి చదివితే ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు.

మొబైల్ ఫోన్ నుంచే దరఖాస్తు ఫారాన్ని నింపి
ఈ యాప్' ద్వారా మొబైల్ ఫోన్ నుంచే దరఖాస్తు ఫారాన్ని నింపి.. పాస్పోర్టు సేవా కేంద్రాన్ని సందర్శించే తేదీ, సమయాన్ని ఎంచుకుని, అప్లోడ్ బటన్ నొక్కితే చాలు. నిశ్చింతగా.. అనుకున్న సమయానికి పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లి.. ధ్రువపత్రాల పరిశీలన, ఫొటో దిగే తంతును పూర్తిచేయొచ్చు.

నిర్ణీత రుసుములను..
పాస్పోర్టు కోసం చెల్లించాల్సిన నిర్ణీత రుసుములను కూడా మొబైల్ ద్వారానే చెల్లించే వీలుంది. ఈ యాప్లో పాస్పోర్టు తత్కాల్, జనరల్ ఫీజులను చెల్లించడం.. విద్యార్హత, నివాస, వయోధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయవచ్చు.

దరఖాస్తు ఎప్పుడు ఏ స్టేజిలో ఉందో ..
అంతేకాక, ఒకసారి దరఖాస్తు పూర్తి చేసి, పంపిన తర్వాత తమ దరఖాస్తు ఎప్పుడు ఏ స్టేజిలో ఉందో తెలుసుకునే వీలుంది.

దరఖాస్తుదారు తమ ప్రాంత పరిధిలోనే..
ఇప్పటి వరకు దరఖాస్తుదారు తమ ప్రాంత పరిధిలోనే పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలనే నియమం ఉండేది. ఇప్పుడా నిబంధన లేదు. ఒక ప్రాంతంలో నివసించే పౌరుడు.. దేశంలోని ఏ పాస్పోర్టు సేవా కేంద్రం నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తుదారు పేర్కొన్న చిరునామాకే పాస్పోర్టును పంపుతారు.

ఉదాహరణకు..
ఉదాహరణకు.. ముంబాయికి చెందిన వ్యక్తి హైదరాబాద్లో తాత్కాలికంగా నివసిస్తున్నట్లయితే.. సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో లేదా..బేగంపేట, టోలిచౌకీల్లోని పాస్పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఢిల్లీ పోలీసులు వెరిఫికేషన్ వివరాలను హైదరాబాద్ అధికారులకు అందజేస్తారు.

పోలీస్ వెరిఫికేషన్
పాస్పోర్టు జారీ సందర్భంగా గతంలో పోలీస్ వెరిఫికేషన్ ఉండేది. పోలీసులు ఇచ్చే నివేదికపైనే పాస్పోర్టు జారీ చేసేవారు. అయితే, ఇప్పుడా నిబంధన లేదు. పోలీస్ వెరిఫికేషన్ను తొలగించారు.

ప్రభుత్వం వివిధ గుర్తింపు కార్డులు..
దరఖాస్తుదారుడికి ప్రభుత్వం వివిధ గుర్తింపు కార్డులు జారీ చేసినప్పుడు మళ్లీ వాటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. దరఖాస్తుదారుడిపై కేసులు ఉన్నాయా? లేదా? అన్న దానికి మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ పరిమితం కానుంది.

వివాహ ధ్రువీకరణ పత్రం ..
దీంతో పాటు పాస్పోర్టు దరఖాస్తుకు వివాహ ధ్రువీకరణ పత్రం కూడా ఇకపై అవసరం లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. ‘వితంతువుల విషయంలోనూ ఆ నిబంధన వర్తించదు. వివాహ ధ్రువపత్రం అవసరం అని చెప్తున్న నిబంధనను తాము రద్దు చేసినట్లు తెలిపారు.

విడాకులు తీసుకున్న దంపతులు
విడాకులు తీసుకున్న దంపతులు తమ పూర్వ భాగస్వామి వివరాలు తెలియపర్చాల్సిన అవసరం లేదు. ఇక వారి పిల్లలు కేవలం తల్లి లేదా తండ్రి పేరును పాస్పోర్టు దరఖాస్తులో పేర్కొనవచ్చు' అని వివరించారు.

విదేశాంగ పరిధిలో..
హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికుల పాస్పోర్టులు, వీసాలు కావాలంటే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్తుంటారు. కానీ పాస్ పోర్టు వ్యవహారాలు అన్నీ విదేశాంగ పరిధిలో ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సేవలు తీసుకొచ్చాం' అని వెల్లడించారు.

రెండు దశల్లో 251 పాస్పోర్టు రిజిస్ట్రేషన్ కేంద్రాలను
ఇప్పటివరకు ఈశాన్య ప్రాంతంలో గుహవటిలో మాత్రమే పాస్పోర్టు కార్యాలయం ఉంది. ఇప్పుడు కొత్త పాస్పోర్టు కేంద్రాలు ఈ ప్రాంతంలో పనిచేయనున్నాయన్నారు. 'గత రెండు దశల్లో 251 పాస్పోర్టు రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రకటించాం. వాటిలో 212 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మూడో దశలో మరో 38 రిజిస్ట్రేషన్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నాం' అని అన్నారు.

ఇప్పటివరకు 260 వర్కింగ్ పాస్పోర్టు కేంద్రాలు
ఇప్పటివరకు 260 వర్కింగ్ పాస్పోర్టు కేంద్రాలు ఉండగా, లోక్సభ నియోజవర్గ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా ఏఏప్రాంతాల్లో పాస్పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాలో అధికారులు, విదేశాంగ శాఖ జాబితా తయారు చేస్తోందని తెలిపారు.

6వ పాస్పోర్టు దివస్' సందర్భంగా
6వ పాస్పోర్టు దివస్' సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం సుష్మా స్వరాజ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మార్పులను ఆమె ‘పాస్పోర్టు విప్లవం'గా అభివర్ణించారు.


Click it and Unblock the Notifications