UPI యాప్స్ ఉపయోగిస్తున్నారా.. ఈ కొత్త రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..!
గతంతో పోలిస్తే డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరిగాయి. UPI సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ఆధారంగా బ్యాంకులు మరియు చెల్లింపుల సంస్థలు జులై 31, 2025 నాటికి అత్యధికంగా ఉపయోగించే 10 UPI ఆప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) గుర్తించాలి.
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
అనంతరం ఆగస్టు 1, 2025 నుంచి UPI సంస్థలు ఆయా API లపై పరిమితి విధించాల్సి ఉంటుంది. ఇందులో బ్యాలెన్స్ ఎంక్వైరీతోపాటు ట్రాన్సాక్షన్ స్టాటస్ వంటి ఆప్షన్స్పై పరిమితులు ఉంటాయి. ఇందుకు సంబంధించి NPCI కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఆగస్టు 1, 2025 నుంచి UPI యాప్స్లో మొత్తంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ రిక్వస్ట్లు 50 కు పరిమితం చేయబడటాయి. అన్ని యూపీఐ యాప్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అంటే ఒక రోజులో యూపీఐ యాప్స్లో 50 కంటే ఎక్కువసార్లు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసేందుకు అవకాశం ఉండదు.
కొత్త నిబంధనలు ఇందుకే! :
రోజులో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు యూపీఐ నెట్వర్క్పై ఒత్తిడిని తగ్గించడమే ఈ కొత్త మార్గదర్శకాల లక్ష్యమని తెలుస్తోంది. గతంలో సిస్టమ్ ఓవర్లోడ్ కారణంగా అనేకసార్లు ట్రాన్సాక్షన్లు నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తాయి. వీటిని తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు.
ఆగస్టు 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ఫోన్పే, పేటీఎం సహా ఇతర యాప్స్లో రోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ను తనిఖీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆటోమేటిక్ డెబిట్ అయ్యే ట్రాన్సాక్షన్లు ఉదయం 9AM - 1PM మరియు 5PM - 9.30 PM మినహా ఇతర సమయాల్లోనే జరగనున్నాయి.
కొత్త రూల్స్కు లోబడి పనిచేయాలి.. లేకుంటే :
కొత్త మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నట్లు ధ్రువీకరిస్తూ PSPలు హామీ ఇవ్వాలి. వీటిని సక్రమంగా అమలుచేయకపోతే.. కొత్త కస్టమర్ ఆన్బోర్టింగ్ నిలిపివేత, జరిమానా, API పరిమితులు విధించే అవకాశం ఉంటుంది.
దీంతోపాటు ప్రతి ట్రాన్సాక్షన్ అనంతరం బ్యాలెన్స్కు సంబంధించిన నోటిఫికేషన్ పంపాలని బ్యాంకులకు NPCI సూచించింది. ఫలితంగా మాన్యువల్గా బ్యాలెన్స్ తనిఖీలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తోంది. దీంతోపాటు నెట్వర్క్ పై లోడ్ తగ్గుతుందని అంచనా వేస్తోంది.
యూపీఐలో జూన్ 30, 2025 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను NPCI జారీ చేసింది. ఇందులో భాగంగా యూపీఐ ట్రాన్సాక్షన్ సమయంలో.. అవతలి వ్యక్తి పేరు మాత్రమే యూజర్లకు చూపించాల్సి ఉంటుంది.
మీ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకున్న పేర్లకు బదులుగా బ్యాంకు రికార్డుల్లో ఉన్న పేరును చూపిస్తుంది. ఫలితంగా డబ్బు సరైన వ్యక్తికి చేరుతుందో లేదో తెలుసుకోవచ్చు. P2P (పీర్ టూ పీర్), P2PM (పీర్ టూ పీర్ మర్చంట్) లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications








