AI News Anchor మరో అద్భుతం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ లీసా.. !!
ప్రస్తుతం భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తుండగా.. మరిన్ని రంగాల్లోకి అడుగుపెడుతోంది. రానున్న సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ప్రభావం చూపిస్తుందని నిఫుణులు భావిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్లో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే టీవీ యాంకర్ (AI News anchor) అందుబాటులోకి వచ్చింది. ఒడిశాకు చెందిన ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ ఛానల్ OTV మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ను పరిచయం చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ వార్త చాలా మందిని ఆశ్చర్యాన్ని గురిచేయడం సహా ఆకట్టుకుంటుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ పేరు ఏంటి, ఎలా పనిచేస్తుంది. ఎన్ని భాషల్లో వార్తలు చదవగలదు. ఎలాంటి శిక్షణ ఇచ్చారు. వంటి అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఒడిశా సంప్రదాయం ప్రకారం చేనేత చీరను ధరించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే యాంకర్ పేరు లిసా అని సంస్థ వెల్లడించింది. జర్నలిజం చరిత్రలో ఇదొక కీలక మైలురాయని ఓటీవీ అభిప్రాయపడింది. ఈ ఏఐ యాంకర్ లిసాకు దేశంలోని అన్ని భాషలు తెలుసని పేర్కొంది. ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ భాషల్లోనే లిసా సేవలు వినియోగించుకుంటున్నామని OTV వెల్లడించింది.

ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే యాంకర్ లిసా వార్తలు చదివేందుకు అవసరం అయిన హావభావాలు, ముఖ కవళికలు, భావోద్వేగాలపై పూర్తి అవగాహన ఉందని ఓటీవీ వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్లను కూడా వెంటనే ఇవ్వగలదని మరియు రియల్టైంలో వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలదని పేర్కొంది.
కాలం మారిందని, ప్రస్తుతం చాలా మంది ఇంటర్నెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారని OTV తెలిపింది. జర్నలిజంలో విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న OTV.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ను పరిచయం చేయడం ద్వారా మరో మైలురాయిని చేరుకుందని ఆ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఒడియా యాంకర్ను పరిచయం చేయడం సంతోషంగా ఉందని ఓటీవీ బిజినెస్ హెడ్ లితిషా మంగత్ పాండా తెలిపారు.
ఏఐ యాంకర్ లిసాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలను సంస్థ తెరిచింది. ఏఐ యాంకర్ లిసా సోషల్మీడియాలో చాలా మంది ఫాలోయర్స్ను పొందింది. తాను చదివిన వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు మరింత పాపులారిటీ సంపాదిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే AI యాంకర్ను విదేశాలలో ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు అదే టెక్నాలజీ భారత్కు వ్యాపిస్తోంది. భవిష్యత్లో ఈ టెక్నాలజీ మరిన్ని ఛానళ్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కీలక రంగాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలా మంది ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు పనితీరులో కీలక మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








