స్మార్ట్టీవీ రంగంలోకి వన్ప్లస్ గ్రాండ్ ఎంట్రీ, జియో తోడుగా..
స్మార్ట్ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ తన దూకుడును కొనసాగిస్తోంది.మొబైల్ రంగంలో సంచలనాలు నమోదు చేసిన ఈ దిగ్గజం త్వరలో స్మార్ట్టీవీల రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు వన్ప్లస్ కంపెనీ తన బ్లాగ్ ద్వారా లోగోను రివీల్ చేసి తన తొలి టీవీ విడుదలను ధృవీకరించింది. తద్వారా గత ఏడాది కాలంగా కొనసాగుతున్న రూమర్లకు చెక్ చెప్పింది. లోగో విడుదల చేసింది కాని టీవీకి సంబంధించిన ఫీచర్లు, ధర తదితర వివరాలు ఇంకా ప్రకటించలేదు.

తాజా సమాచారం ప్రకారం వన్ప్లస్ తన మొదటి టెలివిజన్ సెట్ను సెప్టెంబర్ 26 న విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధర, ఇతర స్పెసిఫికేషన్లపై ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలు వెలువడనప్పటికీ, 91 మొబైల్స్ సమాచారం ప్రకారం జియో స్ట్రీమింగ్ యాప్లతో ఇండియాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతికలను పరీక్షిస్తోందని అంచనా. 43, 55, 65, 75 అంగుళాల పరిమాణాల్లో వన్ప్లస్ తన మొదటి టీవీని అమెజాన్ ద్వారా లాంచ్ చేయనుందని సమాచారం.

అగ్రస్థానంలో వన్ప్లస్:
ఇండియా మొబైల్ విపణిలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల సంస్థ వన్ప్లస్ అదరగొట్టింది. ప్రీమియం సెగ్మెంట్ మోడళ్లలో ఆపిల్, శాంసంగ్ను దాటేసి అత్యధిక షిప్మెంట్ (దిగుమతులు) షేర్ ఉన్న కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశంలోకి దిగుమతి అయిన మొత్తం ప్రీమియం ఫోన్లలో 43 శాతం వన్ప్లస్వే అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. ప్రీమియం సెగ్మెంట్ మోడళ్లలో ఆపిల్, శాంసంగ్కు ఉన్న షేర్లను పక్కన పెట్టి వన్ప్లస్ షేర్లు పైపైకి పోతున్నాయి. లాభాల బాటలో పయనిస్తున్నాయి.

రెండో స్థానానికి శాంసంగ్:
ఈ జాబితాలో 22శాతం షేర్తో దక్షిణకొరియా దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ రెండో స్థానానికి పడిపోయింది. 18 శాతం షేర్తో ఆపిల్ మూడో స్థానంలో నిలిచింది. ఇక వన్ప్లస్ నుంచి వచ్చిన ఆల్ట్రా ప్రీమియం ఫోన్ వన్ప్లస్ 7 ప్రోకు భారత మార్కెట్లో విశేషాదరణ లభిస్తోంది. దిగుమతి అయిన మొత్తం వన్ప్లస్ ఫోన్లలో 26 శాతం 7ప్రో మోడల్ ఫోన్లే అని కౌంటర్పాయింట్ పేర్కొంది. ఇక శాంసంగ్లో ఎక్కువగా ఎస్10 ప్లస్ ఫోన్లు దిగుమతి అయినట్లు తెలిపింది. ఈసారి షియోమీ, ఒప్పొ, వివో, హువాయి కూడా ప్రీమియం సెగ్మెంట్లోకి అడుగుపెట్టడంతో పోటీ విపరీతంగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది.

హైదరాబాద్లో అతిపెద్దఔట్లెట్:
ఇదిలా ఉంటే వన్ప్లస్ కంపెనీ అతిపెద్దఔట్లెట్ను హైదరాబాద్లో నిర్మిస్తోంది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్నగర్లో ఇది ఏర్పాటవుతోంది. కంపెనీకి ప్రపంచంలో ఇదే అతిపెద్ద, సొంత స్టోర్. ఈ ఏడాది చివరినాటికి నిర్మాణం పూర్తి కావొచ్చని సంస్థ భావిస్తోంది. వన్ప్లస్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఆరు అంతస్తుల్లో సిద్ధమవుతున్న ఈ కేంద్రంలో రెస్టారెంట్, ప్లే ఏరియా వంటివి అందుబాటులోకి వస్తాయని కంపెనీ జీఎం వికాస్ అగర్వాల్ వెల్లడించారు.

బజాజ్ ఎలక్ట్రానిక్స్తో భాగస్వామ్యం:
వన్ప్లస్ ఉత్పత్తుల విక్రయం కోసం ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.‘ఇప్పటికే హైదరాబాద్ గచ్చిబౌలిలో వన్ప్లస్ ఆర్అండ్డీ సెంటర్ ఉంది. ప్రస్తుతం 150 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. కొన్నేళ్లలో ఈ సంఖ్య వేలకు చేరుకుంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆర్అండ్డీ పరంగా సంస్థకు ఇదే అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుంది. దీంతో పాటు వన్ప్లస్ టీవీ అభివృద్ధి దశలో ఉంది. కొద్ది రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








