ఆన్లైన్ మనీ గేమ్స్ కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి.. తర్వాత ఏం జరుగుతుంది?
ఆన్లైన్ గేమ్స్ కారణంగా అనేక మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిన వారు కొందరైతే, మానసిక ఒత్తిడి భరించలేక నిండు ప్రాణాలను బలితీసుకున్నవారు మరికొందరు. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లకు బానిసైన యువత భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. తెలంగాణాలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కారణంగా ఆర్థికంగా నష్టపోయి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏడుగురు మరణించారు.
ఈ గేమింగ్ డిజార్డర్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య సమస్యగా గుర్తించింది. అయితే రాష్ట్రాల స్థాయిలో అప్పటి వరకు చర్యలు తీసుకుంటున్నా.. దేశంలో ఆన్లైన్ గేమింగ్ కట్టడికి సరైన చట్టం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ నిషేధం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు గత నెలలలో ఆమోదం పొందింది.

లోక్సభ, రాజ్యసభ తక్కువ సమయంలోనే పచ్చజెండా ఊపాయి. బిల్లు చట్టం రూపంలోకి రావడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే అనంతరం కొన్ని సంస్థలు కోర్టు తలుపు తట్టాయి. ఈ పరిణామాల అనంతరం దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు క్రమంగా కార్యకాలాపాలను నిలిపేశాయి.
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ? :
అయితే తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఆన్లైన్ మనీ గేమింగ్ నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన చట్టం అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. బిల్లు తీసుకొచ్చేందుకు మూడేళ్ల ముందు నుంచే అనేక సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు.
ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది ? :
ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ 2025 చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా గరిష్ఠంగా కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దీంతోపాటు నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
చివరిగా వారితో సంప్రదింపులు :
HT నివేదిక ప్రకారం ఐటీ మంత్రిత్వ శాఖ, కీలక బృందాలతో చివరిగా సెప్టెంబర్ 1 న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయా సంస్థలు సర్దుబాటు చేసుకొనేందుకు వీలుగా తగినంత సమయం ఇస్తామని, మంత్రి వారికి హామీ ఇచ్చారు. స్థానికంగా ఉండే అధికార యంత్రాంగం వేధింపులకు గురిచేస్తే నేరుగా మంత్రిత్వ శాఖకు నివేదించాలని కోరినట్లు తెలిసింది.
ఉద్యోగులకు ఉద్వాసన :
ఆన్లైన్ మనీ గేమింగ్ పైన నిషేధం నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ 120 మంది ఉద్యోగులను తొలగించింది. రియల్మినీ గేమింగ్పై బ్యాన్ కారణంగా తమ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని సంస్థ తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
కొత్త చట్టం కారణంగా గేమ్స్క్రాఫ్ట్ పైన తీవ్ర ప్రభావం పడిందని, దీంతో టీమ్స్, ఫంక్షన్స్లో పనిచేసే క్రాఫ్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. తొలగించిన వారికి ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేస్తామని తెలిపింది. మార్చి 2026 వరకు ఆరోగ్య బీమా ప్రయోజనాలను కల్పిస్తామని తెలిపింది.


Click it and Unblock the Notifications








