మీ పేరుతో వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఏకంగా రూ.1.2 కోట్లు బదిలీ చేయించుకున్నారు..!
ఇటీవల కాలంలో భారత్లో పార్సల్ స్కామ్ (Parcel Scam in Hyderabad) కేసులు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. నేరగాళ్లు కొత్త మార్గంలో దోచుకుంటున్నారు. భయపెట్టి నగదు కాజేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ఈ తరహా కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. అయితే ఈ తరహా ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. బాధితుడు 20 రోజుల్లో ఏకంగా 1.2 కోట్ల రూపాయలు కోల్పోయాడు.
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి మే 7వ తేదీన ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడు పేరు మీద ఓ పార్సిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు. అనంతరం తీవ్ర ఆందోళనకు గురిచేశాడు. పూర్తి వివరాలు ఇవ్వాలని మరియు రోజు అంతా అందుబాటులో ఉండాలని సూచించారు.

దీనిపై బాధితుడు స్పందించారు. సుమారు 20 రోజులపాటు సరైన ఆహారం, నిద్ర లేకుండా గడిపానని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజమైన పోలీస్ అధికారిగా భావించానని చెప్పారు. తీవ్ర న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటానని.. పోలీస్ అధికారిగా భావించిన నేరగాడు చెప్పారని హైదరాబాద్కు చెందిన బాధితుడు తెలిపారు. తాను చెప్పినట్లు చేయకుంటే.. ఇబ్బందులు పడతావని బెదిరింపులు పాల్పడినట్లు బాధితుడు తెలిపారు.
డెక్కన్ క్రానికల్ ప్రకారం.. నిరంతరం తమకు అందుబాటులో ఉండాలని నేరగాళ్లు చెప్పారని బాధితుడు తెలిపారు. తొలుత రూ.30 లక్షలు పంపాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు చెప్పారు. అనంతరం 20 రోజుల్లో తాను రూ.1.2 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు పంపినట్లు తెలిపారు.
20 రోజుల కాలంలో తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యాయని... ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు కుటుంబం కూడా ఇబ్బంది పడిందని తెలిపారు. ఇతరులను ఇంట్లోకి రానివ్వద్దని నేరగాళ్లు కండిషన్ పెట్టినట్లు తెలిపారు. మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చేవని అయితే తన భార్య సహకారంతో వాటిని అధిగమించినట్లు తెలిపాడు.
ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. నేరగాళ్లు పోలీసులు సహా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో కాల్స్ చేస్తున్నారు. మీ పేరు మీద ఓ పార్సిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్ వంటి నిషేధిత పదార్ధాలున్నాయని, ఈ కారణంగా ఇబ్బందులు తప్పవని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న బాధితులు భారీగా డబ్బు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నారు.
నేరగాళ్ల మాటలు నమ్మినవారిని... కేసులు నమోదు కాకుండా చూస్తామని చెప్పి, నగదు డిమాండ్ చేస్తున్నారు. అనేక మార్గాల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. కొన్ని ఘటనల్లో బాధితులు నగదు బదిలీ చేసేంత వరకు వీడియో కాల్లోనే లేదా కాల్లోనే ఉండాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఘటనల్లో విదేశీ నేరగాళ్ల హస్తం కూడా ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది.
ఈ తరహా ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సైబర్ క్రైం వెబ్సైట్ ద్వారా ఇటువంటి కాల్స్, మెసెజ్, URL లపై ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతోపాటు ఎటువంటి ధ్రువీకరణ లేకుండా నగదు బదిలీ చేయవద్దని మరియు వ్యక్తిగత వివరాలను వెల్లడించవద్దని సూచించింది.


Click it and Unblock the Notifications








