పార్ట్టైం జాబ్ ఆఫర్.. 96.57 లక్షల రూపాయలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ క్రైం నేరాలు రోజూ ఎక్కడో చోట వెలుగుచూస్తున్నాయి. ప్రజల అమాయకత్వం, అత్యాశ.. నేరగాళ్లకు వరంగా మారుతోంది. మభ్యపెట్టి, ఆశపెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బయటకు వచ్చింది. డబ్బు ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో నేరగాళ్ల గాలానికి చిక్కి ఓ బాధితుడు సుమారు కోటి రూపాయలు నష్టపోయాడు.
ఆన్లైన్ టాస్క్ స్కాం, పార్ట్ టైం జాబ్ స్కాం పేరిట దేశవ్యాప్తంగా ఇటీవల మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మహారాష్ట్రలోని పూణేలో ఇలాంటి మోసాలకు ఎక్కువగా బలవుతున్న ప్రజలు భారీగా నష్టపోతున్నారు. నేరగాళ్లు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫాంలతో ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. భారీగా డబ్బులు సంపాదించవచ్చని, అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని చెబుతూ వారిని మోసం చేస్తున్నారు.

పూణేలోని బధ్వాన్ ఎన్టీఏ రోడ్ సమీపంలోని రామ్బాగ్ కాలనీలో 56 ఏళ్ల యాడ్ ఫిల్మ్మేకర్ నివాసం ఉంటున్నారు. అతని ఫోన్కు ఓ రోజు పార్ట్ టైం జాబ్ ఉందంటూ ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కు స్పందించిన ఫిల్మ్మేకర్.. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లుగా ఓ చాటింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు.
పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఫిల్మ్మేకర్ అంగీకరించడంతో సైబర్ నేరగాళ్లు.. అతన్ని పూర్తిగా నమ్మించేందుకు వెల్కమ్ బోనస్ పేరిట 10 వేల రూపాయలు ఇచ్చారు. దీంతో బాధితుడు నేరగాళ్లను పూర్తిగా నమ్మేశారు. దీన్ని అదనుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు... తామిచ్చిన కొన్ని ప్రీపెయిడ్ టాస్క్లు పూర్తిచేయాలని ఫిల్మ్మేకర్కు సూచించారు.
ఫ్రీ పెయిడ్ టాస్క్ కింద ట్రావెల్ ఏజెన్సీని రివ్యూ చేయాలని అందుకోసం ముందుగా 21,990 రూపాయలు చెల్లించాలని సూచించారు. ఈ డబ్బును రెండు విడతలుగా బాధితుడు చెల్లించాడు. నేరగాళ్లు తిరిగి రూ. 24,809 చెల్లించారు. అనంతరం మరో ఎనిమిది రివ్యూల కోసం 80,000 రూపాయలు చెల్లించాలని సూచించారు. కమీషన్తో కలిసి మొత్తం 94,840 రూపాయలు వస్తాయని బాధితుడిని నమ్మించారు.
అనంతరం కొద్ది రోజుల తర్వాత మరో లక్ష రూపాయలు చెల్లించాలని సూచించారు. అందుకు కమీషన్ కూడా చెల్లించలేదు. అనంతరం మళ్లీ 32.25 లక్షల రూపాయలు చెల్లించాలని, దీంతో పాత కమీషన్ నగదులో సహా ఎక్కువ డబ్బులు వచ్చేలా చూస్తామని నమ్మించారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసినా.. కమీషన్ రాలేదు.
మరోసారి బాధితుడిని సంప్రదించిన నేరగాళ్లు ఈసారి అధిక మొత్తంలో చెల్లించాలని, పాత కమీషన్లతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పారు. అందుకు అంగీకరించిన బాధితుడు మరోసారి 61.32 లక్షలు చెల్లించాడు. అనంతరం బాధితుడుకి ప్రీపెయిడ్ టాస్క్లు సైతం ఏం ఇవ్వలేదు. అతనికి రావాల్సిన కమీషన్ కూడా తిరిగిరాలేదు. అప్పుటికి తాను మోసపోయానని గుర్తించిన ఫిల్మ్మేకర్ చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు ఫిర్యాదులో IPC 419, 420, 34 సెక్షన్ 66c, 66 D కింద పోలీసులు నమోదు చేశారు. సెప్టెంబర్ 25 నుంచి నవంబర్ 5 మధ్య కాలంలో బాధితుడు మొత్తం 58 సార్లు 96.57 లక్షల నగదును నేరగాళ్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. నేరగాళ్లు.. బాధితుడితో చాటింగ్ చేసిన యాప్ నిర్వహకుల నుంచి సమాచారం కోరారు. అలాగే బ్యాంక్ నుంచి సమాచారం తీసుకున్నారు. ఆ సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలి
- జాబ్ ఆఫర్లు ఇస్తామంటూ ఏమైనా మెసేజ్లు వస్తే ఆ సంస్థ వివరాలను పూర్తిగా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.
- నేరగాళ్లు పంపిన వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి.
- జాబ్ ఆఫర్లు మంచిగా ఉన్నా.. అవి నిజమో కాదో తెలుసుకొనే ప్రయత్నం చేశాకే అప్లై చేయాలి.
- మీ వ్యక్తిగత సమాచారం లేదా ఆదాయానికి సంబంధించిన వివరాలను ఈమెయిల్, ఫోన్ ద్వారా గానీ తెలియజేయవద్దు
- తెలియని నంబర్లు, ఈమెయిల్ల నుంచి వచ్చిన లింక్ను క్లిక్ చేయవద్దు.
- నేరగాళ్లు మీతో మాట్లాడేందుకు ప్రయత్నించిన సమయంలో వారి ప్రవర్తన, మాట తీరును గమనించండి, ఏమైనా సందేహం ఉంటే వెంటనే ప్రశ్నించండి.
- అనుమానాస్పద మెసేజ్లు, జాబ్ ఆఫర్లు వంటివి ఏం వచ్చినా సంబంధిత వర్గాలకు రిపోర్ట్ చేయండి.


Click it and Unblock the Notifications








