తెలంగాణా రాష్ట్ర రాజధానిలో పేపాల్ కొత్త టెక్ సెంటర్
అమెరికాకు చెందిన పేమెంట్స్ సేవల సంస్థ పేపాల్ ఇండియాలో తన మూడో టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లో ఆరంభించింది.ఇండియాలో తమ సర్వీసులను విస్తరించే దిశగా మూడో ప్రపంచ టెక్నాలజీ సెంటర్ను పేపాల్ ప్రవేశపెట్టనట్లు ప్రకటించింది. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు సైబర్ దాడుల బారినపడకుండా నిరోధించడానికి పనిచేయనున్న ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ...దుబాయ్, అమెరికా వంటి దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు తమ కుటుంబాలకు డబ్బు పంపుకోవడానికి పేపాల్ సేవలను ఉపయోగించుకోవచ్చని, సురక్షితంగా డబ్బు పంపేందుకు ఇది అనువుగా ఉంటుందని చెప్పారు. వ్యాపారవేత్తలు కూడా నగదు లావాదేవీలు నిర్వహించడానికి పేపాల్ ఉపయోగపడుతుందన్నారు.

ఆన్లైన్లో నగదు చెల్లింపులు సురక్షితం
బహుళజాతి కంపెనీలకు, స్టార్టప్లకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, ఇక్కడ తగినంత మంది ఐటీ నిపుణులు ఉన్నందున టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఈ నగరాన్ని ఎంచుకున్నామని చెప్పారు. కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీతో ఆన్లైన్లో నగదు చెల్లింపులు సురక్షితంగా జరిగేలా చూస్తున్నామని పేపాల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తుషార్ షా అన్నారు. టీ-హబ్, టీబ్రిడ్జ్ వంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఐటీ, టెక్నాలజీ కంపెనీలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని ప్రశంసించారు.

భవిష్యత్తులో ఉద్యోగాలు
పేపాల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ గురుభట్ మాట్లాడుతూ.. భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన సెంటర్లో వంద మంది పనిచేస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందన్నారు. కస్టమర్ల సమాచారాన్ని నిల్వ చేసే డాటా సెంటర్ను ఇండియాలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 200కి పైగా దేశాల్లో సేవలు అందిస్తున్న పేపాల్కు 26 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మనదేశంలో పేపాల్కు ఇది వరకే చెన్నై, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.

రూ.810 కోట్లు వెచ్చించి కొనుగోలు
ఇప్పటికే సంస్థకు చెన్నై, బెంగళూరులో ఇటువంటి కేంద్రాలున్నాయి. భారత్లో 3,500 మంది వరకు ఉద్యోగులున్నారు. భాగ్యనగరికి చెందిన ఫ్రాడ్ ప్రివెన్షన్ సేవల కంపెనీ సిమిలిటీని 2018లో పేపాల్ సుమారు రూ.810 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆన్ లైన్ మోసాలు జరగకుండా ఉండేలా సిమిలిటీ అనే పేపాల్ ఎండ్ టూ ఎండ్ సర్వీసును 2018 హైదరాబాద్లో ప్రారంభించింది.

జయేశ్ రంజన్ విలేకరులతో మాట్లాడుతూ
ఈ సందర్భంగా జయేశ్ రంజన్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణవాసుల్లో చాలా మంది దుబాయి, అమెరికా వంటి దేశాల నుంచి తమ కుటుంబాలకు డబ్బు పంపుకోవడానికి పేపాల్ సేవలను ఉపయోగించుకోవచ్చని అన్నారు. సురక్షితంగా డబ్బు పంపేందుకు, పొందేందుకు ఇది అనువుగా ఉంటుందని చెప్పారు. పేపాల్ 200లకుపైగా దేశాల్లో సేవలు అందిస్తున్నది. 100కుపైగా కరెన్సీల్లో నగదును పంపవచ్చు. తీసుకోవచ్చు.

ఆర్బీఐ అనుమతి
పేపాల్ కొత్త సెంటర్ ద్వారా డేటా సైన్స్, రిస్క్ మేనేజ్ మెంట్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ విస్తృతమైన నైపుణ్యాన్ని పెంపొందించడంపై కంపెనీ దృష్టిపెట్టనుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలను గుర్తించి ఆన్ లైన్ మోసాల నుంచి రక్షించేందుకు ఈ సర్వీసును వినియోగించనున్నారు. డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రారంభమయ్యే స్టార్టప్ బిజినెస్కు అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), భారత ప్రభుత్వం డిజిటిలైజేషన్ లక్ష్యాలను సాధించడంలో హైదరాబాద్ కొత్త పేపాల్ సెంటర్ కీలక పాత్ర పోషించినట్టు నాస్డక్-లిస్టడ్ సంస్థ తెలిపింది. ఆర్బీఐ అనుమతితో పేపాల్ యూజర్ల డేటాను స్థానికంగా స్టోర్ చేసే విషయంపై భాగస్వామ్య సంస్థలతో పనిచేయనున్నట్టు భట్ చెప్పారు.


Click it and Unblock the Notifications








