Paytm కు మరో షాక్.. ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మరో షాక్ తగిలింది. ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. నేషనల్ హైవే అథారిటికి చెందిన రహదారుల నిర్వహణ సంస్థ (IHMCL- Indian Highways Management Company Limited) ఈ నిర్ణయం తీసుకుంది. తమ జాబితాలోనే బ్యాంకుల నుంచి మాత్రమే ఫాస్టాగ్ను కొనుగోలు చేయాలని వాహనదారులకు సూచించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్ను కొనుగోలు చేయాలని సూచించింది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చర్యలతో సతమతం అవుతున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు (Paytm payments bank) ఈ తాజా నిర్ణయంతో మరో షాక్ తగిలినట్లు అయింది.

ఆర్బీఐ నిషేధం అనంతరం పేటీఎం ఎగ్జిక్యూటివ్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతోపాటు కొన్ని పత్రాలను కూడా సేకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి ఎటువంటి దర్యాప్తు ప్రారంభం కాలేదని తెలుస్తోంది. ఎటువంటి సమస్యలను గుర్తించినా పెమా చట్టం కింద కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతానికి అలాంటిది జరగలేదని తెలుస్తోంది.
*Paytm పేమెంట్స్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలక చర్యలు తీసుకుంది. మానిటరీ పాలసీలు, ఇతర నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని కారణంగా డిపాజిట్లు తీసుకోవడం, క్రెడిట్ ట్రాన్సాక్షన్లు చేపట్టకూడదని ఆదేశించింది. ఆర్బీఐ ఆదేశాలతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఫిబ్రవరి 29 తర్వాత వాలెట్స్, ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్లు, టాప్-అప్లు నిలిచిపోనున్నాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యూజర్లు అకౌంట్లలోని నగదును వినియోగించుకొనేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అంటే పేమెంట్స్ బ్యాంకులోని కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్, నేషనల్ మొబిలిటీ కార్టు, ఇతర నగదును విత్డ్రా సహా వినియోగించుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది. దీంతోపాటు రిఫండ్లు, క్యాష్బ్యాక్, వడ్డీపై ఆంక్షలు లేవని పేర్కొంది.
ఆడిట్ నివేదికల ఆధారంగా బ్యాంకులో ఉల్లంఘనలను గుర్తించామని ఈ కారణంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటిడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ నోడల్ అకౌంట్లను రద్దు చేస్తున్నట్లుపేర్కొంది. 2022 సంవత్సరంలోనూ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్పై RBI చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై ఆర్బీఐ చర్యలు అనంతరం ఆ సంస్థ షేర్లు క్రమంగా క్షీణిస్తున్నాయి. అయితేగా తాజాగా జాతీయ రహదారుల సంస్థకు చెందిన రహదారుల నిర్వహణ సంస్థ నిర్ణయంపై పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
*నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) Fastag KYCను ఫిబ్రవరి 29 తేదీ లోపల పూర్తిచేసుకోవాలని సూచించింది. వాహనదారులు వీలైనంత త్వరగా కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కోరింది. లేకుంటే మార్చి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ కార్డులు డియాక్టివేట్ అవుతాయని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications