ట్యాబ్లెట్ పీసీలపై మొబైల్ యూజర్స్కు ఎందుకంత మోజు..

ఇవీ ట్యాబ్లెట్ విశిష్టతలు..: 7 అంగుళాల స్క్రీన్సైజు నుంచి లభించే ట్యాబ్లెట్ పీసీల్లో చాలామటుకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. దీని నుంచి ఈ-మెయిల్స్ను పంపుకోవచ్చు. సోషల్ అప్లికేషన్లను వినియోగించవచ్చు. బ్లూటూత్, వైఫై, వీడియో రికార్డింగ్, వీడియో, వాయిస్ కాల్స్ దీని సొంతం. మోడల్నుబట్టి ఇంటర్నల్ మెమరీ 16 జీబీ నుంచి 64 జీబీ వరకు ఉంది. కొన్ని ట్యాబ్లెట్లయితే హై డెఫినిషన్ వీడియోను ఆఫర్ చేస్తున్నాయి. గీతలు పడకుండా స్క్రీన్పై గొరిల్లా గ్లాస్ ఉంటుంది. తాజాగా హనీకాం 3.0 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది.
ప్రస్తుతం భారత్లో ఆపిల్, శామ్సంగ్, హెచ్టీసీ, బ్లాక్బెర్రీ, డెల్, మోటారోలా, ఏసర్, బీటెల్, ఎంఎస్ఐ తదితర కంపెనీల ట్యాబ్లెట్ పీసీలు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఐప్యాడ్ రూ.36,900 నుంచి, శ్యాంసంగ్ గెలాక్సీ రూ.26 వేలు, బ్లాక్బెర్రీ ప్లే బుక్ రూ.24 వేల నుంచి లభిస్తున్నాయి. చైనాకు చెందిన జడ్టీఈ కార్పొరేషన్ సహకారంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.13 వేల ధర గల ట్యాబ్లెట్ను మార్కెట్లోకి తెచ్చింది. ట్యాబ్లెట్ను వినియోగిస్తున్న వారిలో అత్యధికులు వ్యాపారస్తులే. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి బోర్డు రూం మీటింగుల్లో ఇవి తప్పకుండా ఉంటున్నాయని సెల్కాన్ మొబైల్స్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. త్వరలో మన పార్లమెంటు సభ్యుల చేతుల్లో కూడా వీటిని చూడబోతున్నాం.
భారత్లో ఇంటర్నెట్ను వినియోగదార్ల సంఖ్య 10 కోట్లపైమాటే. టెలికాంలో అపార అవకాశాలతో కంపెనీలు ఇక్కడి మార్కెట్పై దృష్టి పెట్టాయి. ఇదే అదనుగా సోనీ ఎరిక్సన్ రెండు ట్యాబ్లెట్లను విడుదల చేస్తోంది. వీడియోకాన్ ట్యాబ్లెట్ రావడానికి మరో మూడు నెలలు పట్టొచ్చు. ఆసస్ తన ఈ ప్యాడ్ స్లైడ్ను అక్టోబర్లో ఆవిష్కరించనుంది.
ఇటీవలే బెంగళూరుకు చెందిన లక్ష్మీ యాక్సెస్ కమ్యూనికేషన్స్సిస్టమ్స్ మాగ్నం పెప్పర్ పేరుతో మధ్య తరగతి వారికోసం రూ.4,500లకే ట్యాబ్లెట్ను రూపొందించి సంచలనం సృష్టించింది. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్కాన్, మ్యాక్స్, ఫ్లై, జెన్ వంటి దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలు త్వరలో ట్యాబ్లెట్లను మార్కెట్లోకి తేనున్నాయి. ఇప్పటికే బీటెల్ రూ.10 వేలకే ట్యాబ్లెట్ను ఇస్తోంది. మిగిలిన కంపెనీల ధరలూ ఇదే విధంగా ఉండనున్నాయి. ట్యాబ్లెట్ల అమ్మకాలు భారత్లో 75% వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయని పరిశ్రమ వర్గాల సమాచారం. ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ అంచనా ప్రకారం భారత్లో ఏటా 2 నుంచి 3 లక్షల ట్యాబ్లెట్ పీసీలు అమ్ముడవుతున్నాయి. 2011లో 5 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని శామ్సంగ్ అంచనా.


Click it and Unblock the Notifications