PAN ఐడెంటిటీ దొంగతనం: ధని యాప్లో యూజర్ల అనుమతి లేకుండానే లోన్ మంజూరు చేసారు!! బాధితులలో సన్నీ లియోన్ కూడా
నటి సన్నీ లియోన్ నుండి జర్నలిస్ట్ ఆదిత్య కల్రా వరకు చాలా మంది గత రెండు రోజులుగా పాన్ ఐడెంటిటీ చోరీకి గురైనట్లు IANS నుండి వచ్చిన ఒక కొత్త నివేదిక వెల్లడించింది. ఇండియాబుల్స్ యాజమాన్యంలోని ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ ధని నుండి వందలాది మంది వినియోగదారులు తమ క్రెడిట్ హిస్టరీ రికార్డ్లలో లెక్కించబడని బకాయి రుణాలను కనుగొన్నారు. ధని యాప్ ద్వారా లోన్ పొందడానికి పాన్ మరియు అడ్రస్ ప్రూఫ్ వివరాలు అవసరం. అయితే చాలా సందర్భాలలో పాన్ కార్డ్ హోల్డర్లు వారి CIBIL హిస్టరీను తనిఖీ చేస్తున్నప్పుడు బాకీ ఉన్న రుణాన్ని కనుగొన్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. వివరంగా చెప్పాలంటే వినియోగదారుల యొక్క సమ్మతి లేకుండానే వారి పాన్ వివరాలపై ధని ద్వారా రుణం మంజూరు చేయబడింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధని యాప్లో సన్నీలియోన్ పాన్ కార్డ్ ఐడెంటిటీ చోరీ
ప్రముఖ జర్నలిస్ట్ ఆదిత్య కల్రా కూడా ఇటీవల ఇదే రకమైన సమస్యను ఎదుర్కొన్నట్లు ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. "నా క్రెడిట్ రిపోర్ట్లో దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చూసాను. నా పాన్ నంబర్ మరియు పేరు, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లోని చిరునామాలతో IVL ఫైనాన్స్ ద్వారా లోన్ పంపిణీ చేయబడింది. దీనికి సంబంధించి నాకు ఎలాంటి వివరాలు ముందుగా తెలియదు. నా పేరు మరియు పాన్పై పేమెంట్ ఎలా జరుగుతుంది "అని కల్రా ట్వీట్లో పేర్కొన్నారు.
బాలీవుడ్ నటి సన్నీలియోన్ కూడా ఇటీవల ధని యాప్లో పాన్ కార్డ్ ఐడెంటిటీ చోరీకి పాల్పడినట్లు పేర్కొంది. "ఇది నాకు ఇప్పుడే తెలిసింది. కొంతమంది మూర్ఖులు నా పాన్ని ఉపయోగించి రూ.2000 లోన్ తీసుకుని నా CIBIL స్కోర్ (SIC)ని F****d చేసారు" అని లియోన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

వందలాది మంది వినియోగదారులు ధని యాప్ నుండి ఎటువంటి రుణం కోసం దరఖాస్తు చేసుకోలేదని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంతేకాకుండా తీసుకున్న రుణమొత్తాన్ని తిరిగి చెల్లించమని కంపెనీ ప్రతినిధుల నుండి కాల్స్ అందుతున్నాయి అని తెలిపారు. ఈ విషయంపై ధని యాప్ అధికారులు వ్యాఖ్యానిస్తూ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే "ఇది గుర్తింపు దొంగతనం మరియు క్రెడిట్ బ్యూరోలలోని రికార్డులను సరిదిద్దడానికి సంబంధించిన కేసుగా ఉందో లేదో చూడటానికి అన్ని ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు" చెప్పారు.

కొన్ని నివేదికల ప్రకారం వివిధ డేటా ఫీల్డ్ల ద్వారా నిర్దిష్ట కస్టమర్ తమ యొక్క పాన్కు వ్యతిరేకంగా ప్రతి పరికరాన్ని తిరిగి ధృవీకరించడానికి కంపెనీ గ్లోబల్ సెక్యూరిటీ ప్లాట్ఫారమ్ G-డిఫెన్స్తో కలిసి పని చేస్తోంది. గతంలో ఇండియాబుల్స్ కన్స్యూమర్ ఫైనాన్స్ లిమిటెడ్గా పిలిచే ధని లోన్స్ అండ్ సర్వీసెస్ వ్యక్తిగత రుణాలు మరియు చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలకు ఎలాంటి డిపాజిట్లు లేకుండా రుణాలను అందజేస్తుంది. ఒక వ్యక్తి పాన్ కార్డ్ వివరాలు మరియు చిరునామా రుజువును మాత్రమే డాక్యుమెంట్లుగా ఇవ్వడం ద్వారా ధని నుండి లోన్లను పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో ధని యాప్ 5 కోట్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉంది.

సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం మిలియన్ల కొద్దీ పాన్ కార్డ్ డేటాను హ్యాకర్లు దొంగిలించారని మరియు అలాంటి ఒక హ్యాకర్ దాదాపుగా 1.5 లక్షల పాన్ కార్డ్లను డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారని చెప్పారు. "సైబర్ నేరస్థులు మరియు ఈ లీకైన పాన్ డేటాకు యాక్సిస్ ఉన్న వ్యక్తులు ధని యాప్ ద్వారా రుణాలను పొందేందుకు వాటిని దుర్వినియోగం చేయవచ్చు. అయితే ఇది బాధితులకు తెలియకుండానే జరిగే అవకాశం అధికంగా ఉంది. దీనికి సంబదించిన మొత్తం వివరాలను సంబంధిత అధికారులు సరిగ్గా దర్యాప్తు చేయాలి"అని రాజహరియా తెలిపారు.


Click it and Unblock the Notifications