PIN ద్వారానే UPI లావాదేవీలు చేస్తున్నారా.. త్వరలో ఇలా కూడా చేసేందుకు అవకాశం..?
భారత్లో UPI వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతిరోజు కోట్లాది మంది ప్రజలు, వ్యాపారులు యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం భారత్, సింగపూర్, నేపాల్, శ్రీలంక, UAE, ఫ్రాన్స్, మారిషన్ వంటి దేశాల్లో UPI సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల వచ్చిన గణాంకాల ఆధారంగా జూన్ 2025 లో ఏకంగా రూ.24.03 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి.
కీలక మార్పులు! :
యూపీఐ పేమెంట్స్కు సంబంధించి త్వరలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం PIN ఆధారంగా యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్నాం.

బయోమెట్రిక్ ద్వారా :
అయితే త్వరలో బయోమెట్రిక్ ఆధారంగాను యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అంటే ఫింగర్ ప్రింట్, ముఖ గుర్తింపు ఆధారిత వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
యూపీఐలో బయోమెట్రిక్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. పిన్ నంబర్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. మన ప్రమేయం లేకుండా ఇతరులు లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు. ట్రాన్సాక్షన్ వేగం పెరిగే అవకాశం ఉంది. అయితే యూజర్ల బయోమెట్రిక్ డేటాకు సరైన భద్రత కల్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బయోమెట్రిక్ విధానం టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కచ్చితంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. అయితే ఆగస్టు 1 నుంచి యూపీఐ లో కొన్ని మార్పులు రానున్నాయి.
ఆగస్టు 1 నుంచి కీలక మార్పులు :
యూపీఐ లావాదేవీల్లో అవాంతరాలకు చోటు లేకుండా NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త రూల్స్ను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా లావాదేవీలు విఫలం కావడం లేదా లావాదేవీలు పూర్తి అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం వంటి సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో UPI లావాదేవీలు ప్రభావితం చెందకుండా మరియు మరింత సౌకర్యవంతంగా UPI ను ఉపయోగించుకొనేందుకు ఈ కొత్త నిబంధనలు వీలు కల్పిస్తాయని NPCI భావిస్తోంది. అయితే ఆగస్టు 1 నుంచి వస్తున్న కొత్త రూల్స్ ఏంటి..?
కొంత మంది యూజర్లు బ్యాంకింగ్ యాప్స్ నుంచి బ్యాలెన్స్ను తనిఖీ చేస్తుంటారు. అదే మరికొంత మంది యూపీఐ యాప్స్ ద్వారానే బ్యాలెన్స్ తనిఖీ చేస్తుంటారు. అయితే ఆగస్టు 1 నుంచి ఇందులో కీలక మార్పులు రానున్నాయి. రోజులో యూపీఐ యాప్స్ ద్వారా గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసేందుకు వీలుంటుంది.
బ్యాలెన్స్ తనిఖీ పై పరిమితులు విధించడం ద్వారా రద్దీని నియంత్రించవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భావిస్తోంది. రద్దీ సమయాల్లో లావాదేవీలు విఫలం కావడం లేదా ఎక్కువ సమయం తీసుకోవడం వంటివి జరగకుండా నియంత్రించవచ్చని NPCI భావిస్తోంది.
యూపీఐ ఆటోపే విధానంలోనూ మార్పులు రానున్నాయని తెలుస్తోంది. ఆగస్టు 1 నుంచి ఆటోమేటిక్ పేమెంట్స్ కోసం నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తుంది. సబ్స్క్రిప్షన్లు, బిల్లులు, EMI లు రోజులో కచ్చితమైన సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. ఇలా చేయడం ద్వారా సాధారణ సమయాల్లో యూపీఐ సేవల్లో వేగం పెరుగుతుందని NPCI భావిస్తోంది.


Click it and Unblock the Notifications








