6G పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. త్వరలో భారీ మార్పులు రానున్నాయా?
టెక్నాలజీ వినియోగంలో ప్రస్తుతం భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 5G విప్లవం ప్రారంభం అయినప్పటి నుంచి గతం కంటే గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ను విస్తరించేందుకు టెలికాం సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా... తాజాగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దేశంలో 6G శకం ప్రారంభం కానుందంటూ ప్రధాని నరేంద్రమోడీ సూచనప్రాయంగా వెల్లడించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. 6Gపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. అయితే మోడీ ప్రకటన అనంతరం 6G గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

అయితే 6G అంటే ఏంటి.. సామర్థ్యం ఎలా ఉంటుంది.. ఎప్పటికి దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.. దీంతో ఎటువంటి మార్పులు రావొచ్చు అంటూ చర్చ ప్రారంభం అయింది. దేశంలో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 5G అందుబాటులోకి వచ్చింది. వేగవంతమైన డేటా సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లోకి ఈ సాంకేతికత విస్తరించాల్సి ఉంది.
దేశం ప్రస్తుతం 5G నుంచి 6G వైపు అడుగులు వేసేందుకు సిద్ధం అవుతోంది. 6G టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ప్రధాని మంత్రి మోడీ చెప్పారు. ప్రస్తుతం భారత్లోని 700 జిల్లాల్లో 5G నెట్వర్క్ అందుబాటులో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అధిక శాతం మంది ప్రజలకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. 5G టెక్నాలజీ ఎన్నో అవకాశాలకు నాంది అని.. ఈ టెక్నాలజీ ప్రారంభ సమయంలో మోడీ వ్యాఖ్యలు చేశారు.
5G రెప్పపాటు కాలంలో మనకు కావాల్సిన సమాచారాన్ని అందించగలదు. అదే 6G టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. ఈ వేగం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. 5G సెకనుకు 10 గిగాబైట్ల వరకు వేగవంతమైన సేవలను అందిస్తుంది. అదే 6G ఒక సెకనుకు 1 టెరాబైట్ వరకు వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అందరికీ అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే 100 సినిమాలను డౌన్లోడ్ చేసేందుకు ఒక నిమిషం సమయం సరిపోతుందని భావిస్తున్నారు. 6G సూపర్ కూల్ హోలోగ్రామ్ల సౌలభ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిజిటల్ ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తుంది. వర్చువల్ రియాలిటీని మరింత వాస్తవికంగా మారుస్తుంది. గేమింగ్ సహా ఇతర రంగాలకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
6G టెక్నాలజీ, ఫీచర్ల గురించి మోడీ తమ ప్రసంగంలో వెల్లడించారు. రిమోట్ కంట్రోల్ ఫ్యాక్టరీలు, ఆటోమేటిక్, మానవుల భావోద్వేగాలను అర్థం చేసుకొనే గ్యాడ్జెట్లు 6G రాకతో వస్తాయన్నారు. అయితే 6G అనేది కేవలం వేగాన్ని సూచించే పదం మాత్రమే కాదు, ఇది ఒక తరాన్ని సూచిస్తుంది. 2G మెసేజింగ్ను ఎలా అందించిందో, 4G మొబైల్ యాప్ వ్యవస్థను ఎలా ప్రవేశపెట్టిందో, 6G మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తుందని తెలుస్తోంది.
భారత్ కూడా 6G టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రధాని మోడీ భారత్ 6G విజన్ డాక్యుమెంట్ను ప్రారంభించారు. టెలికాం శాఖ.. భారత్ 6G అలయన్స్ పేరుతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. దేశంలో రెండు దశల్లో 6G టెక్నాలజీ కోసం ప్రణాళికలు రూపొందించింది.
తొలి దశ 2023 నుంచి 2025 వరకు ఉంటుంది. ఈ సమయంలో వివిధ రకాల ఆలోచనలు, ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లకు మద్దతు అందిస్తారు. రెండో దశ 2025 నుంచి 2030 వరకు ఉంటుంది. 6G టెక్నాలజీపై ఇప్పటికే అనేక దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే మోడీ వ్యాఖ్యలపై 6G టెక్నాలజీపై అందరి దృష్టిపడినా గానీ.. ఈ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇంకా సమాచారం లేదు. దేశంలో గత సంవత్సరం జులై నెలలో 5G స్పెక్ట్రమ్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు పాల్గొన్నాయి. జియో 5G కోసం రూ.88,078 కోట్లతో తొలిస్థానంలో, ఎయిర్టెల్ రూ.43,084 కోట్లతో రెండో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications








