మన్ కీ బాత్లో ప్రధాని మోడీ చెప్పిన యాప్ ప్రత్యేకత ఏంటి.. ఎలా ఉపయోగపడుతుంది..!
భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న నిర్వహించిన మన్ కీ బాత్ 121 ఎపిసోడ్లో (Mann ki Baat 121 Episode) అనేక అంశాలను ప్రస్తావించారు. ఇందులో ఇటీవల జరిగిన పహల్గాం ఘటన సహా అనేక అంశాలపై మాట్లాడారు. గతంలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం తీసుకొనే చర్యలను వివరించారు. అయితే ఏప్రిల్ 27 వ తేదీన ప్రసారం అయిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ముఖ్యంగా ఓ యాప్ గురించి ప్రస్తావించారు.
ప్రజలు అందరూ సాచెత్ యాప్ను (Sachet App) ఉపయోగించాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఈ యాప్ ప్రజలను అప్రమత్తం చేస్తుందని తెలిపారు. రియల్ టైం అప్డేట్స్ అందిస్తుందని చెప్పారు. ఈ యాప్ను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) రూపొందించింది.

సాచెత్ యాప్ ద్వారా భారీ వర్షాలు, తుఫానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో అలెర్ట్ చేస్తుంది. ఈ యాప్ యూజర్ GPS ద్వారా రిటైల్ టైం అప్డేట్స్ను అందిస్తుంది. నోటిఫికేషన్ల రూపంలో ప్రజలను అప్రమత్తం చేస్తుంది.
ఈ సాచెత్ యాప్ అలెర్ట్ నోటిఫికేషన్లతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రకృతి విపత్తు సమయంలో.. క్షేమంగా ఎలా బయటపడేందుకు సాయం చేస్తుంది. ఉదాహరణకు భూకంపం లేదా హీట్వేవ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తుంది.
ఈ సాచెత్ యాప్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక వివరాలను ఉపయోగించుకుంటుంది. ఫలితంగా యూజర్లకు సరైన వివరాలను అందిస్తుంది. వాతావరణ మార్పులు, వర్షపాతం, ఉష్ణోగ్రత వంటిని తరచూ పర్యవేక్షిస్తుంది. ఆయా ప్రాంతంలో వచ్చే విపత్తులను గుర్తించి, అప్రమత్తం చేస్తుంది.
సాచెత్ యాప్ వినియోగించుకొనేందుకు సౌకర్యంగా ఉంటుంది. యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్ను యూజర్లు తమ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేశాక.. GPS అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఫలితంగా రియల్టైం అప్డేట్స్ను అందిస్తుంది.
భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల గురించి ముందే అలెర్ట్ పొందేందుకు ఆండ్రాయిడ్ ప్రత్యేక ఫీచర్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 OS లో Earthquake Detector ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇండియా సహా అనేక దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలను మాత్రమే ఈ ఫీచర్ ద్వారా గుర్తించవచ్చు.
భారత్లో ఈ ఆండ్రాయిడ్ Earthquake Detector ఫీచర్ గూగుల్ పిక్సల్, శాంసంగ్, వన్ప్లస్ స్మార్ట్ఫోన్స్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉండే యాక్సెలిరోమీటర్ సిస్మోమీటర్ (భూకంపాలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు) తరహాలో పనిచేస్తుంది. ఈ యాక్సెలిరోమీటర్ భూకంప తీవ్రత, లొకేషన్ వివరాలను అందిస్తుంది.
ఈ ఫీచర్ ద్వారా తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలను గుర్తించలేరు. భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న సందర్భాల్లో మాత్రమే ఈ ఆండ్రాయిడ్ ఫీచర్ సరిగ్గా పనిచేస్తుంది. భూకంప తరంగాల కంటే ఇంటర్నెట్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణించి యూజర్లను అప్రమత్తం చేస్తాయని గూగుల్ చెబుతోంది.


Click it and Unblock the Notifications








