మొబైల్ వాలెట్ యాప్స్ వాడేవారు ఈ న్యూస్ తప్పక చదవండి
మొబైల్ వాలెట్ యాప్లను వాడుతున్న వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. ఆయా వాలెట్లకు గాను ఫుల్ కేవైసీ చేయించుకునేందుకు గడవును మరొక ఆరు నెలల పాటు పెంచింది. ఆర్బీఐ ఆ గడువును ఫిబ్రవరి 29, 2020 వరకు పొడిగించుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఫోన్పే, అమెజాన్ పే, పేటీఎం తదితర అనేక మొబైల్ వాలెట్ యాప్లను స్మార్ట్ఫోన్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే ఆధార్, ఇతర వివరాలతో ఇప్పటికే చాలా మంది పాక్షిక కేవైసీ చేసి ఆయా యాప్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఆగస్టు 31, 2019 లోగా ఆయా యాప్లకు గాను ఫుల్ కేవైసీ (ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్) చేయించుకోవాలని గతంలో ఆర్బీఐ గడువు ఇచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని మరో 6 నెలలకు పొడిగించడంతో వినియోగదారులు ఆ గడువులోగా ఆ వాలెట్ యాప్లలో ఫుల్ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే వంటి మొబైల్ వ్యాలెట్ సంస్థలు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకల్లా తమ వినియోగదారుల కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని తొలుత ఆర్బీఐ గడువు విధించింది. ఇది పూర్తయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా యాప్ల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చునని సదరు మొబైల్ వ్యాలెట్ సంస్థలకు సూచించింది. అయితే ముందుగా నిర్దేశించిన 18 నెలల గడువులోగా కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇప్పుడు దాన్ని 24 నెలలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.

మొబైల్ వ్యాలెట్ సంస్థ ప్రతినిధి నేరుగా తమ వినియోగదారుడి వద్దకు వెళ్లి, వారి వేలిముద్రతోపాటు పాటు అన్ని పత్రాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంది. అంతుకుముందు వ్యాలెట్ సంస్థలు ఆన్లైన్లోనే స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ప్రక్రియను పాక్షికంగా నిర్వహించేవి. ఇది కొంత శ్రమతో కూడుకున్న వ్యవహారం కావడంతో వినియోగదారుడితో ఫేస్ టు ఫేస్ ధ్రువీకరణ అవసరం లేకుండా సరళతరమైన విధానం అందుబాటులోకి తేవాలని ఇంతకుముందే భారతీయ చెల్లింపు మండలి (పీసీఐ) సూచించింది.

మొబైల్ వాలెట్ కస్టమర్లు ఫుల్ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ వాలెట్ సర్వీస్ ప్రొవైడర్లు డైరెక్ట్గా వారి ప్రతినిధులను పంపి కస్టమర్ల వెరిఫికేషన్ను పూర్తిచేస్తారు. ఆధార్ సాయంతో ఈ-కేవైసీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విధానానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది.

కాగా కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేసుకోని కస్టమర్లు ఇంకా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. మొబిక్విక్, ఓలా మనీ వంటి పలు ఇతర మొబైల్ వాలెట్లకు కూడా తాజా గడువు పొడిగింపు వర్తిస్తుంది. ఇప్పటికీ కేవైసీ పూర్తి చేసుకొని కస్టమర్లు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం మంచిది. అప్పుడే నిరంతరాయ సేవలు పొందొచ్చు.


Click it and Unblock the Notifications