నెట్ బ్యాంకింగ్ వాడేవారికి శుభవార్త, ఆర్టీజీఎస్,నెఫ్ట్ ఛార్జీలు ఎత్తేశారు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నెట్ బ్యాంకింగ్ వాడేవారికి శుభవార్త చెప్పింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో NEFT (National Electronic Funds Transfer), RTGS (Real Time Gross Settlement System) ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా ఆన్లైన్ లావాదేవీలపై ఛార్జీల రద్దుతో ఆయా బ్యాంకుల కస్టమర్లకు ఎంతో ఊరట కలగనుంది. ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేయడం నిజంగా కస్టమర్లకు ఎంతో మేలని చెప్పవచ్చు. కాగా డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు దీనిని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.

లావాదేవీలపై ఛార్జీలను
RTGS, NEFT ఆన్లైన్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ. 'డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించే లక్ష్యంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్ను వినియోగదారులు ఉపయోగిస్తే వసూలు చేసే ఛార్జీలను ఎత్తివేస్తున్నామని, బ్యాంకులు దీనిని అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. RTGS, NEFT ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లకు ఆర్బీఐ మినిమం ఛార్జీలను వసూలు చేస్తోంది.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల కిందట ఆర్టీజీఎస్ సమయాన్ని ఆర్బీఐ గంటన్నర పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు ఆర్టీజీఎస్ సమయం సాయంత్రం గం.4.30 వరకు ఉండగా ఇప్పుడు ఆర్బీఐ దీనిని సాయంత్రం గం.6.00 వరకు పొడిగించింది. ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్కు రాత్రి గం.7.45 వరకు పొడిగించింది.

రూ. 2లక్షల వరకు నగదు లావాదేవీల కోసం
ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ కోసం ఆర్టీజీఎస్, రూ. 2లక్షల వరకు నగదు లావాదేవీల కోసం ఎన్ఈఎఫ్టీని సాధారణంగా వినియోగదారులు ఉపయోగిస్తుంటారు. వీటి ద్వారా నగదు బదిలీలు చేసినప్పుడు బ్యాంకులు కొంత ఛార్జీలు వసూలు చేస్తాయి. ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు SBI ఎన్ఈఎఫ్టీ లావాదేవీలపై రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది. ఈ ట్రాన్సాక్షన్స్ పైన బ్యాంకుల నుంచి ఆర్బీఐ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో బ్యాంకులు కూడా కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి.

ఇంటర్చేంజ్ ఫీజు ఛార్జీలను
ఇదిలా ఉంటే ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఏటీఎం ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా ఆర్బీఐ ఈ సంకేతాలిచ్చింది. ఇందులో రెపో రేటు పావు శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6 శాతం రెపో రేటు 5.75 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. ఈ సందర్భంగా ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించింది.

ఏటీఎం ఛార్జీలు, ఫీజులు
ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని, ఏటీఎం ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలనే డిమాండ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేయాలని నిర్ణయించామని ఆర్బీఐ తెలిపింది. ఇందులో స్టేక్ హోల్డర్స్కు చోటు కల్పిస్తామన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీ తమ సూచనలను, సలహాలను తమ మొదటి సమావేశం తర్వాత... రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

2010 జులై తర్వాత
ఆ కమిటీ ఇచ్చిన సూచనలకు ఆ తర్వాత వారం రోజుల్లో కూర్పు తీసుకు వస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, 2010 జులై తర్వాత రెపో రేటు 5.50 శాతంగా ఉండగా ఆ తర్వాత ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇప్పుడే. వడ్డీరేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించిన ఆర్బీఐ
నెఫ్ట్, ఆర్టీజీఎస్ల ద్వారా చేపట్టే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్బీఐ ఏటీఎం చార్జీల విషయంలో కూడా బ్యాంకు ఖాతాదారులకు భారీ ఊరట నివ్వబోవడం విశేషం. ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించిన ఆర్బీఐ ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని, ఏటీఎం ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలనే డిమాండ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేయాలని నిర్ణయించామని తెలిపింది.


Click it and Unblock the Notifications