అప్పుల ఊబిలో ఆర్కామ్, జియో సాయం ఎంతంటే ?
ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడటానికి ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీ తన అధీనంలోని కొన్ని ఆస్తులను ముఖేష్ అంబానీకి విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమ్ముడు రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తులను ఇతరుల చేతుల్లోకి వెళ్లనీయకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆ ఆస్తులను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు కూడా. ఇందులో భాగంగానే ప్రముఖ వ్యాపార దిగ్గజమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ అప్పుల ఊబిలో చిక్కుకుపోవటంతో, సంస్థకు చెందిన వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్ అండ్ ఎంసీఎన్ ఆస్తులను అన్న ముకేష్ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు విక్రయించడానికి గత డిసెంబర్లో ఒప్పందం చేసుకున్నారు. ఈ డీల్ ఇప్పుడు లైవ్ లోకి వచ్చింది.

రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను..
అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ సంస్థ రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను రిలయన్స్ జియోకు అమ్మేసింది.

248 నోడ్లతో పాటు..
వీటిలో 248 నోడ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తులు కూడా వున్నాయి.

5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతాన్ని ..
ఇందులో భాగంగా 5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతాన్ని కూడా టెలికాం మౌలిక వసతుల కోసం జియోకు బదిలీ చేసింది. ఈ క్రమంలో ఇంకా 25 వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడానికి ఆర్కామ్ ప్లాన్ చేసుకుంటోంది.

ఒప్పందం మిగిలినవి..
నోడ్స్ అమ్మకం పూర్తి కాగా, ఇంకా 122.4 మెగా హెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్, 43000 టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్ అమ్మకాలు ఇంకా ఈ ఒప్పందంలో వున్నాయి.

ఈ నెల మొదట్లో కూడా ..
ఈ నెల మొదట్లో కూడా తన రూ.250 బిలియన్(రూ.25000 కోట్ల) ఆస్తుల అమ్మకపు ప్రణాళిక ప్రక్రియ నడుస్తుందని ఆర్కామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అధికారికంగా ప్రకటించింది...
మా ఎంసీఎన్, సంబంధిత మౌలిక సదుపాయల ఆస్తులను రూ.20 బిలియన్లకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు అమ్మే ప్రక్రియ పూర్తయిందని రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది.

జియోతో ఒప్పందం
గత ఏడాది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్.. రిలయన్స్ జియోతో ఒప్పందం కుదర్చుకుంది. భారీగా తనకున్న అప్పులను తగ్గించుకునేందుకు ఆర్కామ్ వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్ అండ్ ఎంసీఎన్ ఆస్తులను జియోకు అమ్మేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ డీల్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications








