సరికొత్త వ్యాపారంలోకి రిలయన్స్ కమ్యూనికేషన్స్
మొబైల్ బిజినెస్ రంగాన్ని అన్నకి అప్పజెప్పిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబాని ఇప్పుడు ఏం చేస్తున్నారు.
మొబైల్ బిజినెస్ రంగాన్ని అన్నకి అప్పజెప్పిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబాని ఇప్పుడు ఏం చేస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యానికి స్వస్తి పలికారా..లేక కొత్త వ్యాపారం వైపు తన దృష్టిని మళ్లించారా అనేది చాలా మందికి తెలియదు..అయితే అందరి అంచనాలకు అందకుండా అనిల్ అంబాని సరికొత్త వ్యాపార సామ్రాజ్యంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సముద్రం అడుగున కేబుల్స్ వేయడం ద్వారా కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఏడాదికి రూ. 6400 కోట్లను ఆర్జించే లక్ష్యంగా ఇప్పుడు పావులు కదుపుతున్నారు.

సముద్ర భూభాగ కేబుల్ వ్యవస్థను..
వైర్లెస్ వ్యాపారాన్ని మూసివేస్తున్నామని, వ్యాపార సంస్థలకు (బీ 2 బీ) సేవలందించడంపైనే దృష్టి సారిస్తామని ఇటీవలే ప్రకటించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇప్పుడు సముద్రం లోపల 68 వేల కిలోమీటర్ల పొడవైన సముద్ర భూభాగ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

సుమారు రూ.6,400 కోట్ల ఆదాయం..
సముద్రం అడుగున 68,000 కిలోమీటర్ల పొడవునా నిర్మించే కేబుల్ ద్వారా ఏటా బిలియన్ డాలర్ల (సుమారు రూ.6,400 కోట్ల) ఆదాయం లభించగలదని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అంచనా వేస్తోంది.

కొత్త పెట్టుబడి ప్రణాళికలను..
ఈ నేపథ్యంలోనే కొత్త పెట్టుబడి ప్రణాళికలను కొత్త ఆర్కామ్ వెల్లడించింది. ఇందుకోసం సంస్థ 60 కోట్ల డాలర్లు (మన కరెన్సీలో రూ.3,840 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ సబ్మెరైన్ కేబుల్ ద్వారా భారత్లోని తన కేంద్రాన్ని పశ్చిమాన ఇటలీని, తూర్పున హాంకాంగ్ను అనుసంధానం చేయనుంది.

గ్లోబల్ క్లౌడ్ ఎక్స్ఛేంజ్' ద్వారా..
వంద శాతం వాటా కలిగిన అనుబంధ విభాగమైన ‘గ్లోబల్ క్లౌడ్ ఎక్స్ఛేంజ్' ద్వారా ఆర్కామ్ ఈ కేబుల్ వ్యవస్థను నిర్మిస్తున్నది. తమ ప్రధాన కార్యాలయం నుంచి హాంకాంగ్, ఐరోపా దేశాలకు డేటా బదిలీకి వీలు కల్పించేలా ఈ నిర్మాణం కొనసాగనుంది.

ఐదేళ్లలో మూడింతలయ్యే అవకాశం..
ఇది పూర్తయితే ఏటా రూ.6,400 కోట్ల ఆదాయం లభిస్తుందన్నది సంస్థ అంచనా. ఈ నెట్వర్క్ ద్వారా అనుబంధ విభాగం ఆదాయం ఐదేళ్లలో మూడింతలయ్యే అవకాశం ఉందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో ఆర్కామ్ పేర్కొంది.

2020లో మూడో త్రైమాసికానికల్లా ..
ఏటా 100 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించగల సత్తా కలిగిన ఈ కేబుల్ వ్యవస్థ 2020లో మూడో త్రైమాసికానికల్లా అందుబాటులోకి వస్తుందని ఆర్కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్బార్నే తెలిపారు.

భారత్ నుంచి ఇటలీకి, హాంకాంగ్కు..
తమ కేబుల్ భారత్ నుంచి ఇటలీకి, హాంకాంగ్కు ఉంటుందని, రాబోయే అయిదేళ్లలో నిర్మాణం పూర్తయ్యాక, అధిక ఆదాయం ఆర్జిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.

సవాలుగా స్వీకరించి ముందడుగు..
వ్యాపార సంస్థలకు సేవలందించే ఎంటర్ప్రైజ్ కంపెనీని ప్రారంభించడం సవాలేనని, మొత్తం వ్యాపారంలో ఎంటర్ప్రైజ్ కంపెనీ వాటా 10-15 శాతమేనంటూ దీనిని సవాలుగా స్వీకరించి ముందడుగు వేస్తామని తెలిపారు.

30 మంది వరకు భాగస్వాములు..
ఈ ప్రాజెక్టులో 30 మంది వరకు భాగస్వాములుంటారని, అందువల్ల ముందస్తు విక్రయాల ద్వారానే 700 మి.డాలర్లు (సుమారు రూ.4,500 కోట్లు) ఆర్జించగలమని పేర్కొన్నారు.

ఆలీబాబా సహా ఆరుగురితో ఒప్పందం..
ఇప్పటికే ఆలీబాబా సహా ఆరుగురితో ఒప్పందం చేసుకున్నామని, 300 మి.డాలర్ల పెట్టుబడికి హామీలు లభించాయన్నారు. రూ.45 వేల కోట్ల మేర అప్పులభారంతో సతమతమవుతున్న ఆర్కామ్.. ఈ మధ్యనే మొబైల్ సేవల వ్యాపారం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications








