దివాలాకు సై అంటున్న అనిల్ అంబానీ, ఆర్కామ్ అప్పు ఎంతంటే ?
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి తెర వెనక్కి వెళ్లిపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పక్రియకు రెడీ అయింది. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలు చేపట్టేందుకు జాతీయ కంపెనీ లా అప్ప
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి తెర వెనక్కి వెళ్లిపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పక్రియకు రెడీ అయింది. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలు చేపట్టేందుకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడంతో ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) దివాలా ప్రక్రియను ఎదుర్కోనుంది. కాగా దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తూ గతంలో వేసిన సవాల్ పిటిషన్ను ఆర్కామ్ ఉపసంహరించుకున్నది. దీంతో ఎన్సీఎల్ఏటీ.. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎరిక్సన్ పిటిషన్ మేరకు కంపెనీకి వ్యతిరేకంగా దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ లోగడ ఆదేశించగా.., దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్కామ్ గతేడాది జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటిషన్ దాఖలు చేసింది.

రూ.1,500 కోట్ల బకాయిల వసూళ్లలో భాగంగా
దాదాపు రూ.1,500 కోట్ల బకాయిల వసూళ్లలో భాగంగా 2017 సెప్టెంబర్లో ఎరిక్సన్ ఇం డియా.. ఆర్కామ్ దాని అనుబంధ సంస్థలైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికంలపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్లు వేసింది.

2018 మే 15న
ఆర్కామ్, ఆ సంస్థ అనుబంధ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికాంకు వ్యతిరేకంగా ఎరిక్సన్ దివాలా పిటిషన్ వేయడంతో ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ 2018 మే 15న తీర్పు జారీ చేసింది. తాత్కాలిక పరిష్కార నిపుణుడిని సైతం నియమించింది.

గతేడాది మే 30న బ్రేకులు
ఈ క్రమంలో దివాలా ప్రక్రియ మొదలవగా, దీన్ని ఎన్సీఎల్ఏటీలో ఆర్కామ్ సవాలు చేయడంతో గతేడాది మే 30న బ్రేకులు పడ్డాయి. అయితే ఎరిక్సన్ ఇండియా బకాయిల కేసు పరిష్కారమైన నేపథ్యంలో సంస్థ పునరుద్ధరణకు చక్కని మార్గం ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్సేనని ఆర్కామ్ బోర్డు నిర్ణయానికొచ్చింది.

ప్రయత్నాలు విఫలం కావడంతో
సంస్థ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దివాలా ప్రక్రియ మెరుగైనదిగా కంపెనీ బోర్డు భావించింది. దీంతో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని ఆర్కామ్ కోరడంతో అందుకు ఎన్సీఎల్ఏటీ అనుమతించింది.

రూ.45,733 కోట్లు బాకీ
ఎన్సీఎల్ఏటీ చైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దివాలా ప్రక్రియ మొదలుకు ఆదేశించింది. బ్యాంకులకు ఆర్కామ్ రూ.45,733 కోట్లు బాకీ పడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే బిలియనీర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి కారాగార ముప్పు నుంచి బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు సరిగ్గా ఒక్కరోజు ముందు స్వీడన్ టెలికం పరికరాల తయారీ సంస్థ- ఎరిక్సన్కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) చెల్లించింది.

అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో ఊరట
ఇంకో ఆసక్తికర అంశం ఏంటేంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.453కోట్లు క్లియర్ చేయడంతో ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ముఖేష్ అంబానీ బాసట
అనిల్ కంపెనీకి ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ బాసటగా నిలవడం, కంపెనీ ఆస్తులను జియో కొనుగోలు చేయడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎరిక్సన్కు బకాయిలను చెల్లించింది. అంతకుముందు రిలయన్స్ జియోకు ఆస్తులు విక్రయించినప్పటికీ తమ బకాయిలను చెల్లించలేదని ఎరిక్సన్ సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలుచేయగా, అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ ఛీప్ ఛాయా విరానీలను నిందితులుగా సుప్రీం విచారణ సాగింది.

నాలుగు వారాల్లో
నాలుగు వారాల్లోగా ఎరిక్సన్ ఇండియాకు రూ.453కోట్లను చెల్లించాలని లేనిపక్షంలో మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కొవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారికి రూ.కోటి చొప్పున జరిమానా కూడా విధించింది. దీనిని ఒక రోజు ముందు చెల్లించడంతో ఆయన కారాగారా ముప్పు నుంచి తప్పించుకున్నారు.


Click it and Unblock the Notifications








