జియో అంబానీ జీవిత కల నేరవేరేనట్లే..మరో భారీ ఢీల్
టెక్ వ్యాపారంలో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో భారీ ఒప్పందానికి రెడీ అయింది. జియో ప్లాట్ఫామ్స్లో అబుదాబికి చెందిన ముబాదాలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ బిలియన్ (100 కోట్ల )డాలర్ల మెగా డీల్ కు సిద్ధమవుతోంది. ఈ పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వారంలోనే అధికారికంగా దీనిపై ప్రకటన వచ్చే అవకాశం వుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఐ) చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో(పీఐఎఫ్) కూడా చురుగ్గా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇవి ఎంత పెట్టుబడి పెడుతుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, రెండు సంస్థలు 2 బిలియన్ డాలర్లకు పెట్టుబడి పెట్టనున్నాయి. బహుశా జియో ప్లాట్ఫామ్లలో వాటా అమ్మకాలకు సంబంధించి ఇదే చివరికి కావచ్చని కూడా టెక్ సంస్థలు భావిస్తున్నాయి. ఈ డీల్ ద్వారా పీఐఎఫ్ అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలవనుందని అంచనా.

రూ .85,000 - రూ .90,000 కోట్లు సేకరించాలని
జియో ప్లాట్ఫామ్ల వాటా అమ్మకాల ద్వారా రూ .85,000 - రూ .90,000 కోట్లు సేకరించాలని ఆర్ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు వ్యూహాత్మక పెట్టుబడిదారుల ద్వారా కంపెనీ రూ. 78,562 కోట్లు (10 బిలియన్ డాలర్లకు పైగా) సాధించింది. దీంతో అంబానీ కల సాకారం ఎంతో దూరంలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. (జియోలో కేకేఆర్ భారీ పెట్టుబడి)

జియో ప్లాట్ఫామ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం
కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన జియో ప్లాట్ఫామ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఫేస్బుక్ ఏప్రిల్ 22న రూ. 43,574 కోట్లతో 9.99 శాతం వాటాలు కొనుగోలు మొదలు వరుసగా మెగా డీల్స్ ను ప్రకటిస్తోంది.

సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్
ఇప్పటికే జియో ప్లాట్ఫామ్స్లో సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ లాంటి దిగ్గజ సంస్థలు జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులకు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. దీంతోపాటు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో రెండు బిలియన్ డాలర్ల మరో భారీ ఒప్పందం చేసుకోనుందని ఇటీవల పలు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిపై రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి వుంది.

రూ 53,124 కోట్లతో రైట్స్ ఇష్యూ
ఇదిలా ఉంటే రూ 53,124 కోట్లతో తాము జారీచేసిన దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ విజయవంతంగా ముగిసిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్ఐఎల్) వెల్లడించింది. రైట్స్ ఇష్యూకు మదుపుదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఇష్యూ 1.59 రెట్లు సబ్స్క్రైబ్ అయిందని తెలిపింది. దేశ, విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లతో పాటు లక్షలాది చిన్న మదుపుదారులు ఈ ఇష్యూ పట్ల ఆసక్తి కనబరిచారు. రైట్స్ ఇష్యూలో ప్రజల వాటా 1.22 రెట్లు సబ్స్ర్కైబ్ అయిందని ఆర్ఐఎల్ ప్రకటించింది. ఈనెల 10 నుంచి షేర్ల కేటాయింపు జరగనుంది.జూన్ 12న రైట్స్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వద్ద లిస్ట్ కానున్నాయి.

రైట్స్ ఇష్యూ గ్రాండ్ సక్సెస్
రైట్స్ ఇష్యూపై కంపెనీ చేపట్టిన వినూత్న ప్రచారం మంచి ఫలితాలను రాబట్టింది. రైట్స్ ఇష్యూ విజయవంతం కావడంతో ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ స్పందిస్తూ రైట్స్ ఇష్యూలో పాల్గొన్న వాటాదారులకు ధన్యవాదాలు తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో రైట్స్ ఇష్యూ మైలురాయిలా నిలిచిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో సతమతమవుతున్న సమయంలో ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ విజయవంతం కావడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సంకేతమని ముఖేష్ అన్నారు.


Click it and Unblock the Notifications








