MWC 2018లో కొత్త విషయాలను బయటపెట్టిన జియో , శాంసంగ్ తోడుగా..
జియో బార్సిలోనాలో సరికొత్త విషయాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా Internet of Things సర్వీసులను విస్తరించేందుకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సహకారం తీసుకోనుంది.
జియో బార్సిలోనాలో సరికొత్త విషయాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా Internet of Things సర్వీసులను విస్తరించేందుకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సహకారం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా జియోని విస్తరించడమే లక్ష్యంగా ముందుకు దూసుకువెళ్లుతోందని కంపెనీ తెలిపింది. ఇది వినియోగదార్లకు, వ్యాపార సంస్థలకు రెండింటికీ సహాయపడుతుందని చెబుతున్నారు. ''మేం ప్రతి నెల దాదాపు 8000 నుంచి 10,000 టవర్లను నెలకొల్పుతున్నాం'' అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అధ్యక్షుడు జ్యోతీంద్ర ఠక్కర్ చెప్పారు. సెప్టెంబరు లేదా అక్టోబరు (దీపావళి) నాటికి 99 శాతం మందికి సేవ లందించే స్థితికి కంపెనీ చేరుతుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు.

170 రోజుల్లో సుమారు 10 కోట్ల మంది కస్టమర్లను..
కాగా గత ఏడాది 170 రోజుల్లో సుమారు 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకున్నామని, ఇది అసాధారణ విజయమని, ఉచితం నుంచి పెయిడ్ కస్టమర్లుగా మార్చుకోవడంలో మా సామర్థ్యాన్ని జనం సందేహించినా దాన్ని మాకనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించామని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అధ్యక్షుడు జ్యోతీంద్ర ఠక్కర్ చెప్పారు. ప్రస్తుతం జియో కంపెనీకి 16 కోట్ల పెయిడ్ కస్టమర్లు ఉన్నారు.

చరిత్రలోనే అతి పెద్ద సంఖ్యలో..
చరిత్రలోనే అతి పెద్ద సంఖ్యలో వాడకందార్లు ఉచితం నుంచి చెల్లింపు సర్వీసులకు మారారని, మానెట్వర్క్ కార్యకలాపాలు ప్రారంభించిన 16 నెలల లోపలే 16 కోట్ల మంది పెయిడ్ సబ్స్క్రైబర్లను సంపాదించుకుందని రిలయన్స్ జియో టెక్నాలజీ విభాగ సీనియర్ ఉపాధ్యక్షుడు తారిక్ అమీన్ చెప్పారు.

ఐయాట్ సర్వీసుల ద్వారా..
ఇదిలా ఉంటే ఐయాట్ సర్వీసుల ద్వారా రవాణా, వాతావరణ అంచనా, వ్యవసాయ రంగాలతో పనిచేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఐయాట్పై మూడవ పక్ష డెవలపర్లతో కలసి పనిచేసేందుకు ఉన్న అవకాశాన్ని కూడా అది అన్వేషిస్తోంది.ఐయాట్ ఎప్పటి నుంచి మొదలవగలదనే ప్రశ్న కు, కంపెనీ మొత్తం ఆవరణ వ్యవస్థను సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని అమీన్ జవాబిచ్చారు.

అఖిల భారత స్థాయిలో..
ఒక నగరం తర్వాత మరో నగరంలా కాకుండా, అఖిల భారత స్థాయిలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. నెట్వర్క్ సంసిద్ధత కోసం ఎదురు చూడడం లేదని, ఐయాట్ ప్లాట్ఫాం పరిణతి కోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. ఎల్టీఈలో జియో కవరేజి 2జి కవరేజీని మించుతుందని, ప్రతి వ్యక్తి, ప్రతి గ్రామం అనుసంధానవుయ్యేట్లు చూస్తామని అమీన్ చెప్పారు.

మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తిలో ..
మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తిలో భారత్ ప్రపంచంలో 154వ స్థానంలో, డాటా వినియోగంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచంలో అతి పెద్ద డాటా, వీడియో వినిమయ నెట్వర్క్లు కలిగి ఉన్నామని భావిస్తున్నామని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 201 8ని ఉద్దేశించి అమీన్ అన్నారు.

ముంబయిలో ఇప్పటికే ..
ముంబయిలో ఇప్పటికే ఐయాట్ సర్వీసులు పరిచయం చేసిన జియో ఇన్ఫోకామ్ వాటిని అఖిల భారత స్థాయిలోకి తీసుకురావాలని భావిస్తోంది. దేశవ్యాప్త ఐయాట్ నెట్వర్క్ నెలకొల్పేందుకు కలసి పనిచేస్తామని జియో ఇన్ఫోకామ్, శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించాయి.


Click it and Unblock the Notifications