సగానికి సగం మంది జియోను వదిలేస్తారా..?
జియో ఉచిత ఆఫర్లు నిలిచిపోనున్న నేపధ్యంలో 50% నుంచి 60% యూజర్లు జియో నెట్వర్క్ను పక్కనపట్టే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల పర్వం తుది అంకానికి చేరుకున్న తరుణంలో, టెలికం సెక్టార్ తిరిగి గాడిలో పడబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జియో రాకతో గత 6 నెలలుగా ఇతర టెల్కోలు తీవ్రంగా నష్టబోతున్న విషయం తెలిసిందే.

రూ.100కే 10జీబి 4జీ డేటా
రిలయన్స్ జియో లాంచ్ చేసిన 4వ తరం లాంగ్-టర్మ్ ఇవల్యూషన్ (4జీ - ఎల్టీఈ) నెట్వర్క్తో, మార్కెట్లో అప్పటి వరకు ఆధిపత్యాన్ని కొనసాగిస్తోన్న భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు కొత్త చందాదారులను కోల్పోవటంతో పాటు ఆర్ధికంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. జియో ఉచిత ఆఫర్లు కొనసాగినంత కాలం ఈ టెల్కోలకు గడ్డు కాలం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జియో బిగ్ అనౌన్స్మెంట్
తాజాగా, రిలయన్స్ జియో చేసిన బిగ్ అనౌన్స్మెంట్ ఇతర టెల్కోలకు కొంతలో కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. ఇందుకు కారణం మార్చి 31, 2017తో జియో తన ఉచిత సేవలను ఆపివేయటమే. ఏప్రిల్ 1 నుంచి జియో సేవలను పొందాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంది.

రూ.99 చెల్లించటం ద్వారా..
జియో యూజర్లు మార్చి 31లోపు రూ.99 చెల్లించటం ద్వారా వారికి జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ సభ్యత్వాన్ని పొందిన వారికి మార్చి 31, 2018 వరకు జియో వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. ఇదే సమయంలో డేటా సేవలను పొందాలంటే నెలకు రూ.303 చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రయోజనాలన్ని జియో యూజర్కు వరిస్తాయి.

ఉచిత ఆఫర్లకు ముగింపు..
ఏదేమైనప్పటికి జియో తన ఉచిత ఆఫర్లకు ముగింపు పలకటంతో ఇతర టెల్కోలు తిరిగి మార్కెట్లో పంజుకునే అవకాశం లభించింది. మరో ఒకటి, రెండు సంవత్సరాల్లో టెలికం సెక్టార్ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించు కుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

170 రోజుల్లో 10 కోట్ల మంది యూజర్లు..
ప్రమోషనల్ ఆఫర్ల పేరుతో కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకోగలిగిన జియో నెట్వర్క్కు మార్చి 31, తరువాత పరిస్థితులు కొంచం కఠినతరంగా మారే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఇందుకు ప్రధానమైన కారణం జియో ఉచిత ఆఫర్లు పూర్తిగా నిలిచిపోవటమే.

జియోను పక్కనపట్టేస్తారా..?
జియో ఉచిత ఆఫర్లు నిలిచిపోనున్న నేపధ్యంలో 50% నుంచి 60% యూజర్లు జియో నెట్వర్క్ను పక్కనపట్టే అవకాశముందని బెంగుళూరు చెందిన ఓ ప్రముఖ టెలికం విశ్లేషకుడు అంచనా వేస్తున్నారు.

అత్యధిక శాతం మంది ప్రీపెయిడ్ యూజర్లే
భారత్లో మొబైల్ నెట్వర్క్ను ఉపయోగించుకుంటోన్న వారిలో అత్యధిక శాతం మంది ప్రీపెయిడ్ యూజర్లే. మొబైల్ డేటా నిమిత్తం వీరు నెల మొత్తం వెచ్చించే రివెన్యూ కూడా సగటున రూ.100 నుంచి రూ.130 మధ్య ఉంది. దీంతో జియో లాంచ్ చేసిన రూ.303 ప్యాకేజీని విశ్లేషించి చూసినట్లయితే ఎంత మంది ఈ ప్రయోజనాన్ని పొందేందుకు ముందు వస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

పరిణామాలు పూర్తిగా మారిపోయే అవకాశం..
జియో నెట్వర్క్ ఇప్పటి వరకు ఉచితంగా అందుబాటులో ఉంది కాబట్టే ఆ నెట్వర్క్ను అంతలా ఉపయోగించుకుంటున్నారని, ఉచిత సేవులు నిలిపివేయటం ద్వారా పరిణామాలు పూర్తిగా మారిపోయే అవకాశముందని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications