టెల్కోలకు దిమ్మతిరిగింది, 5జీతో జియో వచ్చేస్తోంది
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జియో రాక ముందు టెలికాం జియో వచ్చిన తరువాత టెలికాం అని రెండు విభాగాలుగా టెలికాం వ్యవస్థ చీలిపోయింది. ఉచిత ఆఫర్లతో 4జీ సేవలతో దూసుకొచ్చిన జియో అనతికాలంలోనే అత్యధిక కస్టమర్లను ఆకట్టుకుని దేశీయ టెలికాం రంగంలో అతి పెద్ద టెలికాం వ్యవస్థగా నిలిచింది. అయినప్పటికీ ఇంకా ఏదో వెలితి జియోని వెంటాడుతున్నట్లుగా అనిపించిందేమో ఇప్పుడు ఏకంగా 5జీతో దూసుకువచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఓ ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది.

5జీ సేవలను అందించేందుకు..
దేశంలో 5జీ సేవలను అందించేందుకు అమెరికా ఆధారిత టెలికాం సొల్యూషన్స్ సంస్థను ముకేష్ అంబానీ సారథ్యంలోని జియో కొనుగోలు చేయనుంది.

రాడీసిస్తో ఒప్పందం
అమెరికాకు చెందిన రాడీసిస్తో ఒప్పందంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంతకాలు చేసింది. ఓపెన్ టెలికాం సొల్యూషన్స్లో గ్లోబల్ లీడర్గా ఉన్న రాడిసిస్ కార్పొరేషన్ కొనుగోలుకు ఒక ఒప్పందం చేసుకున్నామని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

డీల్ విలువ
ఈ డీల్ విలువ సుమారుగా 74మిలియన్ డాలర్లు. భారతీయులకు 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) లాంటి సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నామని జియో వెల్లడించింది.

అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు
ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ అనుమతితోపాటు, రాడిసిస్ వాటా దారుల సమ్మతి పొందాల్సి ఉందని తెలిపింది. 2018 చివరి(నాలుగు) త్రైమాసికానికి ఈ డీల్ పూర్తికానుందని భావిస్తోంది. అలాగే అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తోంది.

త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి
రాడిసిస్కు చెందిన టాప్-క్లాస్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ టీం రిలయన్స్కు త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి నైపుణ్యాలను అందిస్తుందని, తద్వారా వినియోగదారులు సేవలు మెరుగవుతాయని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ చెప్పారు.

రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన
నాస్డాక్-లిస్టెడ్ కంపెనీగా రాడిసిస్కు ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు, మద్దతు కార్యాలయాలతో పాటు, బెంగళూరులో కూడా ఒక ఇంజనీరింగ్ టీమ్ కలిగి ఉందని రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన తెలిపింది.

రాడిసిస్లో దాదాపు 600 ఉద్యోగులు
ఒరెగాన్లోని హిల్స్ బోరోలో ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడిసిస్లో దాదాపు 600 ఉద్యోగులు ఉన్నారు. ఈ డీల్ ముగిసిన తరువాత రాడిసిస్ డీలిస్ట్ కానుంది.ఆధునిక టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ డీల్ తోడ్పడనుంది జియో భావిస్తోంది.

రెండేళ్ల క్రితం
రెండేళ్ల క్రితం భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ఒకే ఒక అంశం రిలయన్స్ జియో.. మాట్లాడుకోవడానికి చెల్లించక్కర్లేదు.. డేటాకు మాత్రమే చెల్లించండి అనే ట్యాగ్లైన్తో జియో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.

వినియోగదారుల సంఖ్య 20 కోట్లను..
అధికారికంగా 2016 సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో.. తమ మొబైల్ సర్వీసులను కమర్షియల్గా లాంచ్ చేసింది. సేవలను ప్రారంభించిన రెండేళ్లలోపే ఆ కంపెనీ వినియోగదారుల సంఖ్య 20 కోట్లను దాటింది.

జులై 5న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం
జులై 5న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో చందాదారులకు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ ప్రకటించనుంది. 2018 ఏప్రిల్ నెలఖరు నాటికి సబ్స్ర్కైబర్ల సంఖ్య 19.61కోట్లు.

బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను
బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్లలో జియో టాప్-5లో ఉంది. 30.9 కోట్ల మంది వైర్లెస్ యూజర్లతో భారతీ ఎయిర్టెల్ భారత మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది.

వొడాఫోన్, ఐడియా
వొడాఫోన్ 22.2కోట్లు, ఐడియా 21.7 కోట్ల మంది వినియోగదారులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








