తెలంగాణలో రూ.24,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్!! 3000లకుపైగా జాబ్స్
గోల్డ్ రిటైలర్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎలెస్ట్ దేశంలోనే 24,000 కోట్ల విలువైన మొట్టమొదటి డిస్ప్లే ఫ్యాబ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఈ జనరేషన్ 6 అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు చేతుల మీదగా ప్రారంభించనున్నట్లు రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసారు. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు మరియు ల్యాప్టాప్ల కోసం తరువాతి తరం డిస్ప్లేలను తయారు చేసే ప్రతిపాదిత ఫ్యాబ్రికేషన్ యూనిట్ కోసం తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకకు చెందిన ఎలెస్ట్తో MoUపై సంతకం చేసింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఒక పోస్టును ట్వీట్ చేసారు. ట్వీట్ యొక్క సారాంశం విషయానికి వస్తే "తెలంగాణకు నేడు చారిత్రాత్మక రోజు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్), ఫార్చ్యూన్-500 కంపెనీ అత్యంత అధునాతన AMOLED డిస్ప్లేలను తయారు చేయడానికి భారతదేశంలో రూ. 24,000 కోట్ల పెట్టుబడితో మొట్టమొదటి డిస్ప్లే FABని అది కూడా మన తెలంగాణ రాష్టంలో సెటప్ చేయడానికి ముందుకు వచ్చింది. ఇది భారతదేశంలోని హైటెక్ తయారీ రంగంలో అతిపెద్ద పెట్టుబడులలో ఒకటి. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎలెస్ట్ ప్రమోటర్లతో విలీనం చేయబడి ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన పరిశోధనా కేంద్రాల టెక్నాలజీ ఇన్పుట్లతో డిస్ప్లే తయారీ కోసం FABని ఏర్పాటు చేయనున్నారు అని తెలిపారు. తెలంగాణలో డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయడం వల్ల చైనా, అమెరికా, జపాన్ వంటి ఎంపిక చేసిన కొన్ని దేశాలతో సమానంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచుతామని రామారావు అన్నారు.

"ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రకటించినప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఫ్యాబ్ను కలిగి ఉండేలా మిషన్ మోడ్లో పని చేస్తోంది మరియు ఈ పెట్టుబడి మా ప్రయత్నాలను కొనసాగించడానికి మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది" అని కూడా ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి పర్యావరణ వ్యవస్థకు మరియు దాని అనుబంధ సంస్థలకు పెద్ద ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోందని ఆయన అన్నారు.

రాజేష్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) యొక్క AMOLED డిస్ప్లే FAB ఏర్పాటుకు ప్రకటించిన 24,000 కోట్ల పెట్టుబడి ప్రకటనతో తెలంగాణ సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ఫ్యాబ్ సెక్టార్లో ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. ఇది దేశంలోని ఎలక్ట్రానిక్స్ రంగంలో అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడిగా కూడా ఉంది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రోగ్రామ్ క్రింద ఈ డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయబడుతుంది.

రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా మాట్లాడుతూ తెలంగాణలోని డిస్ప్లే ఫ్యాబ్ సరికొత్త టెక్నాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షిస్తుంది. అధునాతన టెక్నాలజీ నిపుణులతో సహా 3,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. AMOLED డిస్ప్లే FAB ఏర్పాటుతో సరఫరాదారుల యొక్క అతి పెద్ద పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. దీనితో పాటుగా ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో మన దేశంలో టెక్నాలజీ వృద్ధి చెందుతుందని ఎలెస్ట్ విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications