ఆర్టీజీఎస్,నెఫ్ట్ ఛార్జీలు లేవు,ఇకపై మొత్తం ఉచితమే
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) లావాదేవీలు నేటి నుంచి చౌక కానున్నాయి. ఆర్టీజీఎస్, నెఫ్ట్ వ్యవస్థల ద్వారా నగదు బదిలీ ఉచిత సేవగా మారింది. డిజిటల్ లావాదేవీలకు ఊతమివ్వడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వీటిపై జూలై 1 నుంచి అన్ని చార్జీలను ఎత్తివేస్తున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని తప్పక తమ కస్టమర్లకు అందించాలని కూడా ఆదేశించింది.

రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) వ్యవస్థను భారీ నగదు బదిలీకి వాడుతుండగా, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్)ను రూ.2 లక్షల వరకు బదిలీకి వినియోగిస్తున్నారు. ఇకపై ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) స్పష్టం చేసింది.

బ్యాంకులు కూడా
తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఇప్పటికే ఆర్బీఐ కోరింది. చార్జీలను తగ్గిస్తే డిజిటల్ లావాదేవీలు పెరగడానికి అవకాశం ఉంటుందని భావించిన ఆర్బీఐ ఈ మేరకు చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలను ప్రోత్సహించేందుకు రిజర్వు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ రూపకర్త నందన్ నీలేకని నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు పలు సిఫారసులు చేసింది.

చార్జీలు ఎత్తివేసిన నేపథ్యంలో
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై రూ.1-5 వసూలు చేస్తోంది. ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది. అయితే ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలు నిర్వహించినప్పుడు ఆర్బీఐ బ్యాంకుల నుంచి వసూలు చేసే ప్రాసెసింగ్ చార్జీలు, టై వెరీయింగ్ చార్జీలు ఎత్తివేసిన నేపథ్యంలో ఆమేరకు భారం తగ్గనుంది. ప్రస్తుతం ఈ లావాదేవీలపై ఆర్బీఐ కనీస చార్జీలను వసూలు చేస్తోంది.

పనివేళల్లో మార్పులు
ఇప్పటికే RTGS సమయాన్ని గంటన్నర సమయం పొడిగించారు. RTGS సాయంత్రం 4.30 గంటల వరకు ఉండగా.. ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. ఇంటర్ బ్యాంకు ట్రాన్సాక్షన్స్కు రాత్రి 7.45 వరకు పొడిగించింది. మరోవైపు ATM వాడకంపై బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు, ఫీజులను కూడా సవరించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై స్టడీ చేసేందుకు RBI అత్యున్నత స్థాయి కమిటీ వేసింది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం వెలువడనుంది.

ఏటీఎం ఛార్జీలు
ఏటీఎం ఛార్జీలను కూడా తగ్గించే ఉద్దేశంతో దాని అమలుకు సాధ్యసాధ్యాల పరిశీలనకు ఐబీఎ ముఖ్యాధికారి వి.జి కన్నన్ నేతృత్వంలో ఒక కమిటీని ఆర్బీఐ వేసింది. ప్రస్తుతం ఏటీఎంల వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు ఈ లావాదేవీలపై విధించే ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్ కూడా పెరిగింది. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్), నెఫ్ట్ (నేషనల్ ఎలక్ర్టానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) లావాదేవీలపై చార్జీలు ఎక్కువగా ఉండటం వల్ల కస్టమర్లపై భారం పడుతోంది.


Click it and Unblock the Notifications








