ప్రభుత్వ పథకాల పేరు చెప్పి కాల్స్, మెసేజ్లు వస్తున్నాయా.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
Cyber Crimes : అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆశపెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో చోట సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తూ.. నగదు దోచుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ పథకాలను టార్గెట్ చేస్తూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి :
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలను ప్రారంభించింది. ప్రతి విద్యార్థికి రూ.13,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్తోపాటుగా అన్నదాత సుఖీభవ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది.

నేరగాళ్లు తమకు అనుకూలంగా :
అదే విధంగా తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు, రైతు బరోసా పథకాలకు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతోపాటు సీఎం సహాయనిధి లబ్ధిదారులకు ప్రభుత్వాల నుంచి లబ్ధిదారులకు నగదు రూపంలో సాయం అందుతోంది. అయితే ఈ పథకాలను నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం నిధులు అధిక శాతం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే మరికొంత మందికి వివిధ కారణాలతో జమకాలేదు. బ్యాంకు ఖాతాల వివరాలు సక్రమంగా లేకపోవడం సహా ఇతర కారణాలతో రూ.13 వేలు బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు.

సైబర్ నేరాలపై పోలీసుల అప్రమత్తం :
దీనిని అవకాశంగా తీసుకొని కొందరు నేరగాళ్లు మహిళలకు ఫోన్లు చేసి, మీ బ్యాంకు ఖాతాలు హోల్డ్లో ఉన్నాయని, కొంత నగదు జమ చేస్తే యాక్టివ్ అవుతాయంటూ నమ్మించి, మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
అదే విధంగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధి పొందాలంటే KYC ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. దీని అదనుగా చేసుకొని, మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

- ప్రభుత్వ పథకాల గురించి ఎవరైనా ఫోన్ లేదా SMS లు చేసినా, వారికి స్పందించే ముందు ధ్రువీకరించుకోవాలి.
- ప్రభుత్వ అధికారులు మరియు బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ కూడా OTP వంటి వివరాలు అడగరు అని గుర్తుంచుకోవాలి.
- KYC అప్డేట్ చేస్తామని చెప్పి OTP అడిగే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ OTP షేర్ చేయవద్దు.
- కొత్త ఫోన్ నంబర్లు, మెయిల్స్కు వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. సరైన ధ్రువీకరణ లేకుండా ఆ లింక్స్ను క్లిక్ చేయవద్దు.
- ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు నిలిచిపోయాయని, వెంటనే నగదు డిపాజిట్ చేయ్యాలని వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- పథకాలకు సంబందించిన నగదు మీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయా లేదా తెలుసుకొనేందుకు బ్యాంకు శాఖకు వెళ్లడం లేదా బ్యాంకు యాప్ల ద్వారా మాత్రమే తనిఖీ చేసుకోవాలి,
- ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా కార్యాలయాలకు వెళ్లడం లేదా ప్రభుత్వ వెబ్సైట్ను మాత్రమే సందర్శించాలి.
తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. విద్యార్థులకు అవసరం అయ్యే వస్త్రాలు, పుస్తకాలు సహా స్మార్ట్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్స్ కొనుగోలు చేస్తుంటారు. నేరగాళ్లు ఈ పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉంది.
అందువల్ల భారీ డిస్కౌంట్లు, లిమిటెడ్ సేల్ అంటూ వచ్చే ప్రకటనలను నమ్మవద్దు. ముఖ్యంగా కొత్త ఫోన్ నంబర్లు, మెయిల్స్కు వచ్చే లింక్స్ పైన క్లిక్ చేయవద్దు. దీంతోపాటు ఆన్లైన్ కొనుగోలు చేసే సమయంలో చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో తక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డులను ఉపయోగించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications