చిన్నారి చేతిలోనే పేలిపోయిన ఫోన్.. మీరు ఇలానే చేస్తుంటే జాగ్రత్తపడండి
సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఫోన్ పేలిపోయిందని, ఫోన్ వాడుతున్నప్పుడు ఒక్కసారిగా చేతిలోనే పేలిపోయి ప్రాణాలు కోల్పోయారని మనం తరచూ వింటుంటాం. మనం అలా చేయకూడదని అనుకుంటాం, కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఆ తర్వాత జాగ్రత్తలు గాలికి వదిలేస్తుంటాం. ఛార్జింగ్లో ఉన్నా కూడా ఒకటి, రెండు నిమిషాలకే ఏం ప్రమాదం జరగదనే ధీమాతో వాడేస్తుంటాం కానీ అవే ప్రమాదాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలను తీసేస్తాయి.
అలాంటి ఘటనే కేరళలో గత రాత్రి జరిగింది. ఛార్గింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ చేతిలోనే పేలిపోయి 8 సంవత్సరాల బాలిక ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.

కేరళలోని పట్టిపరంబుకు చెందిన 8 ఏళ్ల చిన్నారి ఆదిత్యశ్రీ నాన్నమ్మతోపాటు ఉంటోంది. తిరువిల్వమలలోని క్రిస్ట్ న్యూ లైఫ్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 24న (సోమవారం) రాత్రి సమయంలో ఆదిత్యశ్రీ.. ఇంట్లో కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుతోంది. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్లో ఉంది. దాంతో ఒక్కసారిగా చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో చిన్నారి ఆదిత్యశ్రీ ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు.
ఈ ఘటనపై కేసునమోదు చేసిన పజయన్నూర్ పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందాన్ని సైతం ఘటన ప్రాంతానికి పంపించారు. నివేదికల ప్రకారం మూడేళ్ల క్రితం ఈ ఫోన్ను కొనుగోలుచేసినట్లు గుర్తించారు. అందులోని బ్యాటరీని కూడా గత సంవత్సరమే మార్చినట్లు తెలుస్తోంది.
ఫోన్ పేలిపోవడం లాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. 91Mobiles నివేదిక ప్రకారం తాజాగా బిహార్ రాష్ట్రం బగల్పూర్ మొహద్దీనగర్కు చెందిన సంజీవ్ అనే వ్యక్తికి చెందిన ఫోన్ ఇటీవలే పేలిపోయింది. అయితే తన ఫోన్ను మంచం మీద మాత్రమే పెట్టానని, ఆ సమయంలో ఛార్జింగ్ కూడా పెట్టలేదని బాధితుడు సంజీవ్ తెలిపారు.
అయితే మొబైల్ ఫోన్లు పేలిపోతున్నాయనే భయంతో వాటిని దూరంగా పెట్టలేం. ఎందుకంటే ఫోన్ లేకుండా జీవించలేని పరిస్థితికి వచ్చేశాం. కాబట్టి కొన్ని జాగ్రత్తలతో ఫోన్లు పేలకుండా కాపాడుకోవచ్చు.
ఈ కింది జాగ్రత్తలతో ఫోన్లు పేలిపోకుండా మనం జాగ్రత్త పడొచ్చు.
- మనకు ఎంత ముఖ్యమైన పని ఉన్నా లేదా ఒకటి రెండు నిమిషాల పని ఉన్నా కూడా ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఫోన్ వాడకూడదు.
- ప్రత్యేకంగా గేమ్స్ ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- ఫోన్కు ఎటువంటి డ్యామేజ్ జరిగినా వెంటనే రిపేర్ చేయించుకొని వినియోగించాలి.
- అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఫోన్ బయటపెట్టకుండా చూసుకోవాలి.
- ఫోన్ బ్యాటరీ స్థితి ఎప్పుడు చెక్ చేసుకోవాలి.
- ఫోన్కు సంబంధించిన సంస్థ ఛార్జర్లు, కేబుళ్లనే వినియోగించాలి.
- ఫోన్ బ్యాటరీ పాడైపోయినప్పుడు, అదే కంపెనీకి చెందిన బ్యాటరీనే అమర్చుకోవడం మంచిది.
- ఫోన్ వాడుతున్నప్పుడు వేడెక్కుతున్నట్లు గుర్తిస్తే, వెంటనే సర్వీసింగ్ చేయించి వినియోగించాలి
- ఫోన్ను కొందరు రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తుంటారు. 90 శాతం ఛార్జింగ్ దగ్గరే తీసేస్తేనే మంచిది.


Click it and Unblock the Notifications








