మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
ప్రపంచవ్యాప్తంగా 2022 మే నెలలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు పడిపోయాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ మార్కెట్ పల్స్ సర్వీస్ వెల్లడించింది. 100 మిలియన్ల మార్కు కంటే కొంతమేర దిగువకు పడిపోయాయని పేర్కొంది. అంతేకాకుండా ఈ రీసెర్చ్ స్మార్ట్ఫోన్ మొబైల్స్ అమ్మకాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. COVID-19 మహమ్మారి తరువాత V- షేప్ రికవరీని కనబరిచినప్పటికీ.. స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఇంకా మహమ్మారి రావడానికి ముందు ఉన్న మార్కుకు చేరుకోలేదని నివేదిక పేర్కొంది.

కౌంటర్పాయింట్ రీసెర్చ్ యొక్క మార్కెట్ పల్స్ సర్వీస్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మే, 2022లో స్మార్ట్ఫోన్ల మార్కెట్ విక్రయాలు 96 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. ఈ ఏడాది మేలో స్మార్ట్ఫోన్ల గ్లోబల్ మార్కెట్ విక్రయాలు నెలవారీగా (MoM) 4 శాతం మరియు సంవత్సరానికి 10 శాతం (YoY) పడిపోయాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. నెలవారీ అమ్మకాలు ఇలా తగ్గడం ఇది వరుసగా రెండవ సారి అని, ఏడాది అమ్మకాలు విషయానికి వస్తే ఇది వరుసగా 11వ సారి అని రీసెర్చ్ పేర్కొంది. COVID-19 మహమ్మారి తరువాత V- షేప్ రికవరీని కనబరిచినప్పటికీ.. స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఇంకా మహమ్మారి రావడానికి ముందు ఉన్న మార్కుకు చేరుకోలేదని నివేదిక పేర్కొంది. 2021లో సప్లై చైన్ పరిమితులు మరియు COVID-19 అంతరాయాల కారణంగా స్మార్ట్ఫోన్ మార్కెట్ బాగా దెబ్బతిందని నివేదిక తెలిపింది. ఈ ఏడాది కాంపోనెంట్ల కొరత కాస్త స్థిరంగా ఉంటుందని వెల్లడించింది.
ద్రవ్యోల్బణం పెరుగుదల, చైనా ఆర్థిక మందగమనం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 2022లో స్మార్ట్ఫోన్ మార్కెట్ డిమాండ్ కొరతతో దెబ్బతిందని నివేదిక పేర్కొంది. రెండవ త్రైమాసికంలో, 2022 రెండవ సగంలో పరిస్థితి మెరుగుపడుతుందని అంచనా వేసింది. అంతేకాకుండా అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.

చైనా మార్కెట్ మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి సీనియర్ విశ్లేషకుడు వరుణ్ మిశ్రా మాట్లాడుతూ, "చైనా లాక్డౌన్లు మరియు దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం దేశీయ డిమాండ్ను దెబ్బతీస్తోంది. అంతేకాకుండా గ్లోబల్ సప్లై చైన్ను కూడా బలహీనపరుస్తోంది. లాక్డౌన్లు సడలించడంతో చైనాలోని స్మార్ట్ఫోన్ మార్కెట్ మే నెలలో కొద్దిగా కోలుకుంది, అయితే, మే 2021 కంటే ఇది 17 శాతం దిగువన ఉంది " అని తెలిపారు. కౌంటర్పాయింట్ మాక్రో ఇండెక్స్ ప్రకారం, చైనా ఆర్థిక పరిస్థితి సాధారణం కావడం, సాంకేతిక సప్లై చైన్లో డిమాండ్ మెరుగుపడటం వల్ల 2022 రెండో త్రైమాసికానికి పరిస్థితి మెరుగుపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, రెండో త్రైమాసికంలో జూన్ తర్వాత పలు ప్రాంతాలలో ప్రమోషన్ల(ఉదా.. చైనాలో 618, భారత్లో దీపావళి వంటి) కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి, ఆ సీజన్లలో రాబోయే Samsung Galaxy Z Fold 4 మరియు iPhone 14 సిరీస్ స్మార్ట్ఫోన్ల లాంచ్లు డిమాండ్ను పెంచడంలో తోడ్పడతాయని పేర్కొంది.

గత ఏప్రిల్ లో గ్లోబల్ టాప్ సెల్లింగ్ మొబైల్గా iPhone 13 :
గ్లోబల్ మార్కెట్లో గత ఏప్రిల్లో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లలో యాపిల్ కంపెనీ తొలి స్థానం సాధించడం విశేషం. యాపిల్ సంస్థకు చెందిన iPhone 13 గత ఏప్రిల్లో గ్లోబల్గా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్ల జాబితాలో తొలి స్థానం పొందింది. ఈ మేరకు కౌంటర్పార్ట్ అనే సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో యాపిల్ సంస్థ అత్యధిక ఫోన్లు అమ్ముడైనట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో షావోమీ, శాంసంగ్ మొబైల్ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే, యాపిల్ గతేడాది మాదిరిగానే తొలి స్థానం సాధించడం విశేషం. ఈ ఏడాది మార్చిలో అనగా 2022 మొదటి త్రైమాసికంలో కూడా ఐఫోన్ 13 మ్యాక్స్ మరియు ఐఫోన్ 13 అత్యధికంగా అమ్ముడైన డివైజ్లుగా ఉన్నాయని వెల్లడించింది.
యాపిల్కు చెందిన మొత్తం ఐదు మోడల్స్ టాప్ సెల్లింగ్ జాబితాలో ఉన్నాయి. ఐఫోన్ 13 గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 5.5 శాతం వాటాతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో iPhone 13 Pro Max ప్రారంభ ధర రూ. 1,27,900 వద్ద విక్రయిస్తోంది. అదేవిధంగా దేశంలో స్టాండర్ట్ iPhone 13 రూ.72,990కి అందుబాటులో ఉంది. జాబితాలోని మిగిలిన డివైజ్లు iPhone 13 Pro, iPhone 12 మరియు iPhone SE 2022 లు ఉన్నాయి. Apple iPhone SE 2022 మోడల్కి సంబంధించి సమీక్షకుల నుండి మంచి స్పందన రాలేదని తెలుస్తోంది. iPhone SE 2022 టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫోన్ల లిస్ట్లో 7వ స్థానంలో ఉంది.
ఏప్రిల్ నెల మొత్తం అమ్మకాలలో యాపిల్ సంస్థ 89 శాతం వాటాను కలిగి ఉంది, ఈక్రమంలో శాంసంగ్ సంస్థ టాప్ మోడల్స్ మొత్తం అమ్మకాలలో కేవలం 22 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications








