చిక్కుల్లో స్నాప్డీల్, సెక్షన్ 420 కింద కేసు నమోదు
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఫ్లిప్కార్ట్కు గట్టి పోటీ ఇచ్చిన స్నాప్ డీల్.. రెండు మూడేళ్లుగా రేసులో వెనుకబడింది. అమెజాన్ రంగ ప్రవేశంతో భారత్లో ఈ కామర్స్ కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. దీంతో స్నాప్డీల్ అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆ సైట్ చూసేవాళ్లే కరువయ్యారు. అయినప్పటికీ పడుతూ లేస్తూ వస్తున్న ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్డీల్ ఇప్పుడు చిక్కుల్లో పడింది.

నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఫౌండర్స్ అడ్డంగా బుక్కయ్యారు. రాజస్థాన్కు చెందిన వ్యాపారవేత్త ఇందర్మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్డీల్ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్ కేసు నమోదైంది.

బ్రాండెడ్ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు
వ్యాపారవేత్త ఇంద్రమోహన్ సింగ్ హనీ జూలై 17న ఉడ్ ల్యాండ్ బెల్ట్, వాలెట్ లను స్నాప్డీల్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ బ్రాండెడ్ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్ల్యాండ్ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్ల్యాండ్ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ
ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని ఆయన ఆరోపిస్తున్నారు. చేతి గడియారాన్ని ఆర్డర్ చేశా...డెలివరీ చేశామని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది కానీ వాచ్ ఇంటికి చేరలేదని తెలిపారు. అయితే కంపెనీకి ఫిర్యాదు చేయడంతో తన డబ్బులను రిఫండ్ చేసిందంటూ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇంద్రమోహన్ ఫిర్యాదు ఆదారంగా సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు.

షాప్క్లూస్ కొనుగోలు
ఇదిలా ఉంటే దాదాపు మూతపడే స్థాయి నుంచి మళ్లీ పుంజుకున్న స్నాప్డీల్.. ఇప్పుడు మరో ఈ కామర్స్ కంపెనీ షాప్క్లూస్ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. షాప్ క్లూస్ కూడా ఏడాది కాలంగా పెద్దగా ఆర్డర్లు లేకపోవడంతో చతికిల పడింది. అయితే షాప్క్లూస్ను కొనుగోలు చేయడం ద్వారా చిన్న పట్టణాల్లో తన మార్కెట్ను విస్తరించుకోవచ్చునని స్నాప్ డీల్ భావిస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోందని ఎకనామిక్ టైమ్స్ పేర్కోంది. అయితే ఈ డీల్ కాస్త భిన్నంగా ఉండనుంది.

ఏకమొత్తపు నగదు
షాప్ క్లూస్కు నగదుకు బదులు కేవలం 10 శాతం వాటాను ఇచ్చేందుకు స్నాప్డీల్ సమ్మతించిందట. తద్వారా షాప్క్లూస్ను కొనుగోలు చేయడం స్నాప్డీల్కు సులభమే. కానీ షాప్క్లూస్ ప్రమోటర్లకు ఏకమొత్తపు నగదును ఇచ్చేందుకు స్నాప్ డీల్ అంగీకరించిదట. రాధిక అగర్వాల్, సంజయ్ సేధీలు షాప్ క్లూజ్ను ప్రారంభించారు. ఆ ప్లాట్ ఫాంలో చవక ధరల ఉత్పత్తులను విక్రయించేవారు. ఒక స్థాయిలో ఒక బిలియన్ విలువ పలికిన ఈ కంపెనీ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ధాటికి డీలా పడిపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలకు రోజుకు సగటున 6,00,000 ఆర్డర్లు వస్తుండగా స్నాప్డీల్ రోజుకు 2,50,000 వరకు ఆర్డర్లు ప్రాసెక్ చేస్తోంది. ఏడాది క్రితం స్నాప్ డీల్ ఆర్డర్లు 30,000 స్థాయిలో పడిపోయాయి. ఇప్పుడు షాప్ క్లూస్ పరిస్థితి కూడా ఇందుకు భఇన్నంగా లేదని మార్కెట్ వర్గాల సమాచారం.

1.5 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు
స్నాప్ డీల్ వ్యవస్థాపక సీఈవో కునాల్ బాల్.. తన కంపెనీని 1.5 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు ప్రయత్నించినా వ్యాల్యుయేషన్ దగ్గర డీల్ కుదరలేదు. ఫ్లిప్కార్ట్ కేవలం 700-800 మిలియన్ డాలర్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఫ్రీచార్జ్ అనే వాలెట్ను యాక్సిస్ బ్యాంక్కు విక్రయించి రూ.350 కోట్లను సమీకరించింది. దీంతో మళ్లీ కార్యకలాపాలను గాడిలో పెట్టింది. ఇప్పుడు కేవలం షేర్ల పద్ధతిలో షాప్ క్లూజ్ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. నష్టాల్లోనే ఉన్న రెండు కంపెనీలకు ఈ విలీనం ప్రయోజనమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications








