అంతరిక్షంలోకి ఓ రాత్రి గడపాలంటే రూ.400 కోట్లు కావాలి
న్యూస్ చూడగానే ఆశ్చర్యపోయారా.. మరి నిజంగా ఇదే జరిగితే ఇంకెంతలా ఆశ్చర్యపోతారు. నాసా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది.

ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రైవేట్ వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టినట్టు వెల్లడించింది. అయితే ఇలా ఓ రాత్రి గడపాలనుకునే వారికి ఛార్జీ భారీగానే ఉండబోతోంది. నాసా చెప్పిన వివరాల ప్రకారం కక్షలో తిరుగుతున్న ఉపగ్రహంలో ఒక్క రాత్రి గడపాలనుకునే వారి నుంచి 35 వేల డాలర్లు(రూ.24 లక్షలు) చొప్పున వసూలు చేస్తామని తెలిపింది. మొత్తం రానుపోను చార్జీలతో కలిపి ఒక్కొక్కరికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని నాసా వివరించింది.

ఏడాదికి 12 వరకు పెంచే అవకాశం
అంతరిక్ష కేంద్రం నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని నాసా భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాదిలో రెండు సార్లు ప్రైవేట్ వ్యోమగాములను అనుమతించేందుకు అవకాశముందని నాసా అధికారులు తెలిపారు. ఈ పర్యటనలను ఏడాదికి 12 వరకు పెంచే అవకాశం ఉందన్నారు.

డెన్నిస్ టిటో మొట్టమొదటిసారిగా
కాగా అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డెన్నిస్ టిటో మొట్టమొదటిసారిగా 2001లో అంతరిక్షంలోకి వెళ్లిన యాత్రికుడు. ఇందుకు రష్యాకు టిటో రూ.138 కోట్లు చెల్లించారు. ఎనిమిది రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపి తిరిగివచ్చారు. ఈ యాత్ర కోసం ఆయన రష్యాకు రూ.138 కోట్లు చెల్లించారు.ఇక మానవులను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లేందుకు నాసాతో పాటు స్పేస్ఎక్స్ కూడా వివిధ ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రైవేటు అంతరిక్ష యాత్రలను
ఈ ప్రైవేటు అంతరిక్ష యాత్రలను స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థ అంతరిక్షయాన సంస్థలు చేపట్టనున్నాయి. వ్యోమనౌకలో సిబ్బంది, ప్రైవేటు వ్యోమగాములకు వైద్యపరంగా, శిక్షణపరంగా అర్హతలన్నీ ఉండేలా చూసే బాధ్యత ఆ సంస్థలదేనని నాసా పేర్కొంది. 2024లో చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర చేపట్టాలని ప్రణాళికలు రచించినట్లు ఇటీవలే నాసా ప్రకటించింది. తొలిసారి చంద్రుడిపైకి ఓ మహిళను తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించింది

ISSని కమర్షియల్ గా..
కాగా ఇప్పటికే చాలా కంపెనీలు తమ టెక్నాలజీలో ISSని కమర్షియల్ గా వాడుకుంటున్నాయి. ఈ కంపెనీలకు ఈ స్పేస్ టూరిజం మీద కూడా పోగ్రాంలు కండెక్ట్ చేసే దిశగా నాసా అడుగులు వేస్తోంది. ఐఎస్ఎస్ పూర్తి ప్రైవేటీకరణ దిశగానే నాసా తాజా నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను నాసా అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

వాణిజ్య అవసరాలకు వాడకుండా
గతంలో ఐఎస్ఎస్ను వాణిజ్య అవసరాలకు వాడకుండా నాసా నిషేధం అమలు చేసింది. నిజానికి ఈ స్టేషన్ నాసాది కాదు. 1998 నుంచి రష్యాతో కలిసి దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఐఎస్ఎస్ వాణిజ్యపరమైన వినియోగం విషయంలో కొన్ని దశాబ్దాలుగా రష్యా సుముఖంగానే వ్యవహరిస్తోంది.ఈ స్టేషన్కు 2025కల్లా నిధులను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతేడాది బడ్జెట్లో పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇదిలా ఉంటే గతంలో చేసిన ట్వీట్ కు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ‘ మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. అయితే నాసా ఇప్పుడు మాట్లాడాల్సింది చంద్రుడిపైకి వెళ్లే విషయం గురించి కాదు. ఇది 50 ఏళ్ల క్రితమే జరిగింది కదా. వారు దృష్టి పెట్టాల్సిన పెద్ద పెద్ద అంశాలెన్నో ఉన్నాయి. మార్స్(ఇందులో చంద్రుడు కూడా భాగం), రక్షణ వ్యవస్థ, సైన్స్ ఇందులో ముఖ్యమైనవని ట్రంప్ తన తాజా ట్వీట్లో నాసాను విమర్శించారు.

ఆయనపై విమర్శలు
ఈ క్రమంలో ట్రంప్ రెండు ట్వీట్లను పోల్చి చూస్తున్న నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా చంద్రుడు.. అంగారకుడిలో భాగమంటూ ట్రంప్ పేర్కొనడంపై జోకులు పేలుస్తున్నారు. ఈరోజు నుంచి అందరూ గుర్తుపెట్టుకోండి. మూన్.. మార్స్లో భాగమట. ట్రంప్ చెప్పారు' మీరు గ్రేట్ సర్ అంటూ వ్యంగోక్తులు విసురుతున్నారు.

మనిషిని చంద్రుడి మీదకు పంపేందుకు ..
1968లో అపోలో-11 మిషన్ ద్వారా వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకేల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్లను నాసా చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1969 జూలై 20న చంద్రుడి మీద మనిషి కాలు మోపాడు. అయితే తాజాగా మళ్లీ మనిషిని చంద్రుడి మీదకు పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్కి ఆర్టెమిస్( గ్రీకు చంద్రదేవత) అని పేరు పెట్టారు. ఈసారి చంద్రయాత్రలో మహిళా వ్యోమగాములకు కూడా అవకాశం కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది నాసా.


Click it and Unblock the Notifications








