గ్లోబల్ ఇంటర్నెట్ కోసం 60 మిని శాటిలైట్లు నింగిలోకి
అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ 60 శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఫాల్కన్ రాకెట్ ద్వారా ఈ 60 శాటిలైట్లను నిర్దారిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత మెరుగుకానున్నాయి. ఫ్లారిడాలోని కానెవరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్థానిక కాలమాన ప్రకారం సోమవారం ఉదయం ఫాల్కాన్ 9 రాకెట్ ఈ 60 ఇంటర్నెట్ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. రాకెట్ టేకాఫ్ తీసుకున్న గంటలోపే ఇంటర్నెట్ ఉపగ్రహాలను నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని స్పేస్ ఎక్స్ సంస్థ నిర్థారించింది. ఇక అంతకుముందు అంటే మే నెలలో నింగిలోకి పంపిన మరో 60 ఇంటర్నెట్ శాటిలైట్ల సరసన తాజాగా పంపిన ఉపగ్రహాలు చేరుతాయి. వచ్చే ఏడాది మరో 24 మిషన్లను నింగిలోకి పంపాలని స్పేస్ ఎక్స్ భావిస్తున్నట్లు పేర్కొంది. ఇలా పంపడం ద్వారా బ్యాండ్ విత్ పెంపు కవరేజ్ ఏరియా కూడా పెరుగుతుందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది.

3 ఉపగ్రహాలకు భూమితో సంబంధాలు లేవు
మే నెలలో నింగిలోకి పంపిన 60 ఇంటర్నెట్ ఉపగ్రహాలలో 3 ఉపగ్రహాలు భూమితో సంబంధాలు కోల్పోయాయని వెల్లడించింది. ఇక ఈ ఉపగ్రహాలు అక్కడక్కడే తేలియాడుతూ ఉంటాయని చెప్పిన సంస్థ, భూమి గురుత్వాకర్షణ శక్తి కక్ష్యలో నుంచి చిన్నగా బయటకు లాగుతుందని వెల్లడించారు. అయితే ఇది జరిగేందుకు కొన్నేళ్ల సమయం పడుతుందని స్పేస్ఎక్స్ సంస్థ వివరించింది.

నిర్దేశించిన పని పూర్తి చేశాక
ఇక పనిచేస్తున్న ఉపగ్రహాలు వాటికి నిర్దేశించిన పని పూర్తి చేశాక తిరిగి భూమికి చేరేందుకు కావాల్సిన ఇందనం ఆదా చేయాల్సి ఉందని స్పేస్ ఎక్స్ వ్యాఖ్యానించింది. అంతేకాదు అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యతో గందరగోళం కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది.

స్పేస్ ఎక్స్ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ తొలి ట్వీట్
నింగిలోకి ఇదివరకే వెళ్లిన స్టార్లింక్ సర్వీస్ ఉపగ్రహాల ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ తొలి ట్వీట్ చేశారు. స్టార్లింక్ సేవలు ఏదోఒకరోజున ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయని సంస్థ చెబుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంటర్నెట్ సేవలు లేవో అక్కడకు కూడా స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కంపెనీ చెప్పుకొచ్చింది.

ఏడాదికి 30 బిలియన్ డాలర్ల రెవిన్యూ
స్టార్లింక్ సేవల ద్వారా ఏడాదికి 30 బిలియన్ డాలర్ల రెవిన్యూ వస్తుందని ఎలన్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా ఆ తర్వాత కెనడా దేశాలకు సేవలు అందిస్తామని ఆ తర్వాత అంటే 2020 నాటికల్లా ప్రపంచదేశాలకు సేవలను విస్తరింపజేస్తామని మస్క్ తెలిపారు.

రానున్న 10 ఏళ్లలో
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నింగిలోకి 8వేల ఉపగ్రహాలను పంపడం జరిగిందని ప్రస్తుతం 2వేల ఉపగ్రహాలు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వ్యోమగాములు చెబుతున్నారు. ఇక రానున్న 10 ఏళ్లలో ఈ తరహా ప్రయోగాలు జరిగితే నింగిలో ఉపగ్రహాల సంఖ్య 20వేలకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇన్ని ఉపగ్రహాలు ఉంటే తాము పరిశీలించేందుకు కూడా చాలా కష్టం అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఎక్కువ ఉపగ్రహాలు ఉండటం వల్ల కొత్తగా పంపిన ఉపగ్రహాలు ఢీకొనే అవకాశం ఉందని తద్వారా అంతరిక్షంలో శిధిలాలు ఎక్కువగా ఉంటాయనే ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








