లాభాలు గ్యారెంటీ అని చెబుతున్నారా.. స్టాక్ ట్రేడింగ్ యాప్లతో మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలుసా?
సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఆశపెట్టి లక్షల రూపాయలను దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో స్టాక్ ట్రేడింగ్ ప్రత్యేక గ్రూప్లు (Stock Trading app Scam) ఏర్పాటు చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అంతా సవ్యంగా ఉందని భావించి నకిలీ ప్లాట్ఫాంలలో పెట్టుబడి పెడుతున్నారు. చివరికి మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా ఘటనలపై ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సొంతంగా పరిశోధన చేయాలని, సంస్థల గుర్తింపును ధ్రువీకరించుకోవాలని సూచించింది.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం.. సైబర్ దోస్త్ X పోస్ట్ను షేర్ చేసింది. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ పోస్ట్ ఆధారంగా స్టాక్ ట్రేడింగ్ గ్రూప్లలో నకిలీ ప్రొఫైళ్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. ఈ నకిలీ ప్రొఫైల్తో మోసపూరిత లింక్లను షేర్ చేయడం సహా ఇతర పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు.

ఈ తరహా సోషల్ మీడియా గ్రూపుల్లో చేరిన తర్వాత వారిలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారు. అనంతరం పెట్టుబడి పెట్టాలని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను సంపాదించవచ్చంటూ మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని. నగదు బదిలీ చేసే సమయంలో వారి గుర్తింపును ధ్రువీకరించుకోవాలని సూచించింది.
ఈ తరహా మోసాలబారిన పడకుండా ఉండేందుకు కీలక సూచనలు చేసింది. కచ్చితంగా లాభాలు వస్తాయని లేదా మీ పెట్టుబడిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని హామీలిచ్చే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీంతోపాటు పెట్టుబడి పెట్టే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేరగాళ్లు ఒత్తిడి చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
New Scam Alert ! : Cybercriminals with fake profiles and scam #stock trading group links are following victims on @X. #StockMarketScam@MIB_India @HMOIndia @GoI_MeitY pic.twitter.com/iJuRufqCyQ
— Cyber Dost (@Cyberdost) September 29, 2024
బ్రోకరేజీ సంస్థల రిజిస్ట్రేషన్ను ధ్రువీకరించుకోవాలి. దీంతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ర్ల ప్రభావం లేదా ప్రకటనల ద్వారా కాకుండా సొంతంగా పరిశోధన చేసిన తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోండి. నియంత్రణ సంస్థల వద్ద పూర్తి స్థాయి ధ్రువీకరణ పొందిన సంస్థల ట్రేడింగ్ యాప్లను మాత్రమే ఉపయోగించుకోండి.
ఇటీవల ఇదే తరహా ఘటనలో పూణేకు చెందిన డాక్టర్ ఏకంగా రూ.1.22 కోట్లు కోల్పోయారు. నేరగాళ్లు మాటలు నిజమని నమ్మని డాక్టర్ 40 రోజుల్లో 35 నగదు లావాదేవీలు నిర్వహించారు. నేరగాళ్లు సూచించిన యాప్లో నగదు అంతా పెట్టుబడి రూపంలో కనిపించినట్లు తెలిసింది. దీని ద్వారా సుమారు రూ.10 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు ఆ నకిలీ యాప్లో కనిపించినట్లు తెలిసింది.
దీంతో ఆ నగదును తన ఖాతాలకు బదిలీ చేసుకొనేందుకు డాక్టర్ ప్రయత్నం చేశారు. ఆ నకిలీ యాప్ నిర్వాహకులు ఆ నగదును విత్డ్రా చేసేందుకు 5 శాతం డిమాండ్ చేశారు. లేకుంటే ఆ నగదు మొత్తాన్ని బదిలీ చేయడం లేదా విత్డ్రా చేసుకొనేందుకు వీలు లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్ పూణేలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications








