వాట్సాప్ మాతృసంస్థ మెటాపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!
ప్రముఖ టెక్ సంస్థ మెటాపై (Meta) సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీకి సంబంధించి కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. మెటా సంస్థ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని చట్టాలను పాటించకపోతే, భారత్ ను విడిచి వెళ్లవచ్చునని హెచ్చరించారు.
వాట్సాప్ యూజర్ల డేటా :
సుప్రీం కోర్టులో వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీపై ఇవాళ విచారణ జరిగింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను వాట్సాప్ వినియోగించుకుంటోందని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

తమకే కష్టంగా ఉందని.. :
దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు, చదువురాని వ్యక్తులు వాట్సాప్ ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అంటూ వాట్సాప్ మాతృసంస్థ మెటా ప్రతినిధులను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. కొన్ని పాలసీలు అర్థం చేసుకోవడం తమకే కష్టంగా ఉందని.. దేశంలోని లక్షలాది మంది నిరక్షరాస్యులకు ఈ పాలసీలు ఎలా అర్థం అవుతాయని ప్రశ్నించారు.
దేశంలోని చట్టాలను పాటించలేకపోతే :
భారత్లో కార్యకలాపాలు సాగించాలంటే దేశ చట్టాలని కచ్చితంగా పాటించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తమ దేశ ప్రైవసీతో మీరు ఆడుకోలేరని, డేటాకు సంబంధించిన ఒక్క అంకెను షేర్ చేసుకొనేందుకు అనుమతించమని తెలిపింది. దేశంలోని చట్టాలను పాటించలేకపోతే, భారత్ ను విడిచి వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించింది.
వాట్సాప్ 2021 సంవత్సరంలో కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. దీని ఆధారంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్లతో చేసే సంభాషణను ఫేస్బుక్ తో షేక్ చేసుకొనేందుకు అనుమతి లభిస్తుంది. యాప్ వినియోగించాలంటే ఈ పాలసీకి యూజర్లకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది.
దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ కొత్తగా తీసుకొచ్చిన పాలసీని నిలిపేయాలని ఆయా సంస్థలను ఆదేశించింది. ఐటీ చట్టంలోని నిబంధనలను వాట్సాప్ ప్రైవసీ పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన కేసు పైనే ఇవాళ విచారణ జరిగింది.


Click it and Unblock the Notifications








