న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలానికి ఉద్యోగ నియామకాల విషయంలో చిన్న పట్టణాలు, మినీ మెట్రోల్లో సానుకూల ధోరణి కనిపించిందని మై హైరింగ్క్లబ్డాట్కామ్ తాజా సర్వే తెలిపింది. ఇంజనీరింగ్, తయారీ రంగాల్లో ఉద్యోగ కల్పన పెరిగిందని సర్వే పేర్కొంది. దీనిప్రకారం గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో కన్నా ఈ ఏడాది క్యూ1లో పుణే, హైదరాబాద్ వంటి టైర్-టూ నగరాల్లో 23% మందికి అదనంగా ఉద్యోగాలిచ్చామని 41 శాతం కంపెనీలు తెలిపాయి.
ఇక జైపూర్, ఘాజియాబాద్, కోచి వంటి టైర్ త్రీ నగరాల్లో 5% మందికి అదనంగా ఉద్యోగాలిచ్చామని 12% కంపెనీలు తెలిపాయి. ఇదే జోరు రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగుతుందని మై హైరింగ్క్లబ్డాట్కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజేష్ కుమార్ చెప్పారు. మెట్రోల కన్నా టైర్-టూ, టైర్-త్రీ నగరాల్లో ఉద్యోగకల్పన పెరుగుతోందని, అక్కడ వ్యయాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని ఆయన చెప్పారు.