హైదరాబాద్: ఐటి సర్వీసెస్, బిజినెస్ సొల్యూషన్స్ మరియు కన్సల్టింగ్ సేవలను అందించే ప్రముఖ సంస్థ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టిసిఎస్) రాష్ట్రంలో తమ తొలి శిక్షణ మరియు అభివృద్ధి కేంద్రాన్ని (లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్) ప్రారంభించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రత్యక్షంగా ఇంజనీరింగ్ కళాశాలల నుంచి నియమించుకున్న ఉద్యోగులకు మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వటానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ సెంటర్ ద్వారా సంవత్సరానికి 6 వేల మంది నిష్ణాతులను తయారు చేయనున్నామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ వి రాజన్న వెల్లడించారు.ఆర్థిక మాంద్యం తర్వాత వేగంగా విస్తరిస్తున్న ఐటి పరిశ్రమలో ఉద్యోగుల కొరత కూడా పెరుగుతోందని, రానున్న విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 42 కాలేజీల నుంచి 5,500 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులను ఎంపిక చేసుకుని విధుల్లోకి తీసుకోనున్నామని ఆయన తెలిపారు. హైదరాబాదులో టిసిఎస్కు మొత్తం 17500 మంది ప్రోఫెషనల్స్ ఉన్నారు.