‘3జి’ రచ్చ.. నిందిత సంస్థలకు తాత్కాలిక ఉపశమనం..?

తక్షణమే తమ 3జి రోమింగ్ ఒప్పందాలను నిలిపివేయాలని సూచిస్తూ మూడు ప్రధాన టెలికాం సంస్థలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలకు టెలికాం శాఖ (డాట్) శుక్రవారం నోటీసులు జారీ చేసిన నేపధ్యంలో ఆయా సంస్థలకు సంస్థలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. 3జి రోమింగ్ విధానంలో టెలికాం నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ మూడు టెలికాం ఆపరేటర్లపై టెలికాం మంత్రిత్వశాఖ కొరఢా ఝుళిపించేందుకు సిద్ధమైంది. అందుకనుగుణమైన చర్యలను తీసుకోవాలని సదరు మంత్రిత్వశాఖ టెలికాం శాఖ (డాట్)కు సూచించిన నేపథ్యంలో నిందిత సంస్థలు టిడిశాట్ను ఆశ్రయించాయి. దీంతో శనివారం ప్రత్యేకంగా విచారణ జరిపిన టిడిశాట్..జనవరి 3 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని డాట్ను ఆదేశించింది. దీనిపై డిసెంబర్ 31లోగా వివరణ ఇవ్వాలని చెప్పింది.
ఇదిలావుంటే జనవరి 3 తర్వాత మలి విచారణ జరగనుండగా, టెలికాం మంత్రిత్వశాఖ వైఖరి పూర్తిగా ఏకపక్షంగా అన్యాయంగా ఉందని, చట్ట విరుద్ధంగా చర్యలు తీసుకోవాలని చూస్తోందని వొడాఫోన్ వ్యాఖ్యానించింది. లైసెన్సింగ్ విధానంలోని ఎలాంటి నిబంధనలను తాము అతిక్రమించలేదని స్పష్టం చేసింది. కాగా, దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలో 3జి సేవల లైసెన్సులు పొందని టెలికాం ఆపరేటర్లు లైసెన్సులు లేని చోట 3జి సేవలందిస్తున్న సంస్థలతో ఇంటర్ సర్కిల్ రోమింగ్ (ఐసిఆర్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో లైసెన్సులు లేని చోటా పరస్పర సహకారంతో టెల్కోలు 3జి సేవలను అందించే సౌకర్యం కలిగింది. అయితే ఈ విధానాన్ని తప్పుబట్టిన టెలికాం మంత్రిత్వశాఖ ప్రభుత్వానికి రావాల్సి ఆదాయాన్ని దోచుకుంటున్నాయని, ఇది లైసెన్సింగ్ నింధనల ఉల్లంఘనేనని పేర్కొంటూ తగు చర్యలు తీసుకోవాలని డాట్ను ఆదేశించింది. దీంతో ఆయా సంస్థలు టిడిశాట్ను ఆశ్రయించాయి.


Click it and Unblock the Notifications








