ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రానున్న 5 సంవత్సరాల్లోనే ప్రమాదం జరగనుందా ?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ప్రపంచంలో ఓ అద్భుతం. ఏఐతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అదే సమయంలో ఏఐతో లోపాలు కూడా ఉన్నాయి. ఫలితంగా ప్రపంచంలోని దిగ్గజ టెక్ సంస్థల సీఈవోలు సహా నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమీప భవిష్యత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో సుమారు 42 శాతం టెక్ సంస్థల సీఈవోలు రానున్న కొన్ని సంవత్సరాల్లోనే ఏఐ మానవాళిని తన స్వాధీనంలోకి తీసుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రానున్న 5 నుంచి 10 సంవత్సరాల్లో మానవాళిని నాశనం చేసే సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంతమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. వాల్మార్ట్, కోకా కోలా, జిరాక్స్, జూమ్ సహా 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు. యేల్ ప్రొఫెసర్ జెఫ్రీ.. ఏఐ ఫలితాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిని 10 సంవత్సరాల్లో నాశనం చేయగలదని ఈ సర్వేలో పాల్గొన్న 34 శాతం సీఈవోలు అభిప్రాయపడ్డారు. మరో 8 శాతం మంది సీఈవోలు మాత్రం కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఏఐ కారణంగా విధ్వంసం జరగవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మిగిలిన 58 శాతం సీఈవోలు మాత్రం ఏఐపై ఆందోళన అవసరం లేదని చెప్పారు.
ఎలాన్ మస్క్ మరియు ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు సహా మరింత మంది నిపుణులు ఏఐ ప్రమాదాలను హెచ్చరించే ప్రకటనపై సంతకం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్మాన్, గాడ్ఫాదర్ ఆఫ్ ఏఐగా పిలవబడే జియోఫ్రీ హింటన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. భవిష్యత్లో ఏఐ నుంచి ఎదురయ్యే ప్రమాదాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అణుయుద్ధం, కరోనా లాంటి మహమ్మారి నియంత్రణకు ఇచ్చిన తరహాలోనే ఏఐ ప్రమాదాల నియంత్రణ ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు. ఏఐ వ్యవస్థల అభివృద్ధిని కనీసం 6 నెలలపాటు నిలిపేయాలని పిలుపునిచ్చే బహిరంగ లేఖపై మస్క్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. మస్క్ ఇదివరకే ఏఐ మానవ నాగరికతను అంతం చేయగలదనే అభిప్రాయాన్ని తన ట్విట్లో వ్యక్తం చేశారు.
ఇటీవల తన భారత్ పర్యటన సందర్భంగాల ఓపెన్ ఏఐ సీఈవో ఆల్టమన్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరి మానవుల ఉద్యోగాలను భర్తీ చేయగలదని మరియు కొత్త ఉద్యోగాలను సృష్టించగలదని తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందా అని అల్ట్మన్ను ప్రశ్నించినప్పుడు.. ప్రతి సాంకేతిక విప్లవం ఉద్యోగ మార్పునకు దారి తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు పోతాయని, మరికొన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
కొందరు టెక్ నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రమాదమని వాదిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సామర్థ్యాల మెరుగుపడతాయని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్య, ఐటీ/ప్రొఫెషనల్ సర్వీసులు, మీడియా/ డిజిటల్లో అత్యంత ప్రభావం చూపుతుందని ఈ సర్వేలో పాల్గొన్న అత్యధిక మంది టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








