బెంగళూరు: భార్య మృతితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కష్టాల్లో పడ్డాడు. భర్త వేధిస్తున్నాడనే ఆరోపణతో పుట్టింటికి వెళ్లిన మమత అనే 24 వివాహిత పది రోజుల క్రితం తిరిగి వచ్చింది. ఆమె గత సోమవారం రాత్రి విజయనగర్ సమీపంలోని మరేన్హళ్లిలో గల ఎన్హెచ్సిఎల్ లేఅవుట్లోని ఆపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. భర్త పెట్టే వేధింపులు తారాస్థాయికి చేరడంతో భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఓ ఐటి కంపెనీలో పనిచేసే విఎ శివకుమార్ను 2009 నవంబర్ 27వ తేదీన మమత వివాహం చేసుకుంది. పెళ్లయిన మరుక్షణం నుంచే అతను భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
మరో మహిళతో సంబంధాలు ఉండడం వల్లనే అతను ఆమెను దూరంగా పెడుతున్నట్లు అనుమానిస్తున్నారు. రాత్రి విధుల పేరుతో ఎక్కువగా బయటనే ఉండిపోయేవాడని అంటున్నారు. శివకుమార్పై మమత సోదరుడు మురళీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ నిమిత్తం పోలీసులు శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.