జియోని ఢీ కొడతారా..చతికిల బడతారా: రేసులో ఆరుమంది
జియోని సవాల్ చేసేందుకు ఆరు కంపెనీలు రెడీ అయ్యాయి. అక్టోబర్ 1నుంచి మొదలుకానున్నస్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు మొత్తం జియోతో కలిపి ఏడుకంపెనీలు రెడీ అయ్యాయి. ఆసక్తికర అంశం ఏంటంటే మెగా స్పెక్ట్రమ్ వేలం రేసు నుంచి ఏ ఒక్క సంస్థా తప్పుకోలేదు. దరఖాస్తుల గడువు 22తో ముగియడంతో ఇప్పుడు బరిలో ఏడు కంపెనీలు నువ్వా నేనా అంటూ తలపడబోతున్నాయి.కోట్ల డబ్బుతో వేలానికి సిద్ధమయ్యాయి.. జియోతో తలపడేందుకు బరిలో నిలిచిన కంపెనీలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
ఉచిత ఇంటర్నెట్..అన్ని చోట్ల ఉచిత వైఫై

రిలయన్స్ జియో
దేశ వ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఏ బ్యాండ్ స్పెక్ట్రమ్కైనా బిడ్డింగ్ వేసే అవకాశం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం బిడ్ దాఖలు చేయాలంటే రూ.5,610 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది.అయితే రిలయన్స్ జియో అత్యధికంగా రూ.6,500 కోట్లు జమ చేసి బరిలో నిలిచినట్లు మార్కెట్ వర్గాలు నిలిచాయి. జియో నెట్ వర్త్ ఆస్తులు మెత్తం విలువ రూ. 45,042.69 కోట్లుగా ఉంది.

ఐడియా
ఐడియా సెల్యులార్ రూ.2,000 కోట్లు జమ చేసింది. ఐడియా నెట్ వర్త్ ఆస్తులు మెత్తం విలువ రూ. 24,935.84 కోట్లుగా ఉంది.

ఎయిర్టెల్
ఎయిర్టెల్ రూ.1,980 కోట్లు జమ చేసింది. కాగా ఎయిర్ టెల్ నెట్ వర్త్ ఆస్తులు మెత్తం విలువ రూ. 66,643.20 కోట్లుగా ఉంది. కాగా జియోనీ ఢీ కొట్టేందుకు మేము రెడీగా ఉన్నామని ఎయిర్ టెల్ అధినేత ఇప్పటికే సెలవిచ్చారు.

వొడాఫోన్
వొడాఫోన్ రూ.2,800 కోట్లతో జియోతో పోటికి సై అంటోంది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఏ బ్యాండ్ స్పెక్ట్రమ్కైనా బిడ్డింగ్ వేసే అర్హత సొంతం వొడాఫోన్ సైతం సొంతం చేసుకుంది. కాగా భారీ స్థాయిలో స్పెక్ట్రమ్ వేలం జరగనున్న నేపథ్యంలో వొడాఫోన్ తన భారత అనుబంధ సంస్థ వొడాఫోన్ ఇండియాకు 47,700 కోట్ల రూపాయల నిధులు సమకూర్చింది. కాగా నెట్ వర్త్ ఆస్తులు మెత్తం విలువ రూ. 23,040 కోట్లుగా ఉంది.

ఆర్ కామ్
ఆర్కామ్ రూ.313 కోట్లు జమ చేసింది. రీ సెంట్ గా ఎయిర్సెల్ విలీనం కావడంతో ఈ రెండూ విడిగా బిడ్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆర్కామ్ ఈశాన్య భారతం మినహా దేశవ్యాప్తంగా బిడ్ దాఖలు చేసే అర్హత సాధించింది. కాగా నెట్ వర్త మొత్తం ఆస్తుల విలువ రూ. 12,639 కోట్లుగా ఉంది.

ఎయిర్సెల్
ఎయిర్సెల్ కేవలం రూ.120 కోట్లు మాత్రమే ధరావతుగా జమ చేసింది. దీంతో ఎయిర్సెల్ మాత్రం 700, 800, 2500 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ కోసం బిడ్ వేసే అర్హత సాధించలేకపోయింది.

టాటా టెలీ
టాటా టెలీ రూ.1,000 కోట్లు ధరావతుగా చెల్లించింది. ముంబై, మహారాష్ట్ర సర్కిళ్లలో అన్ని బ్యాండ్ల స్పెక్ట్రమ్ బిడ్డింగ్కు అర్హత పొందింది. మిగతా చోట్ల అర్హత సాధించలేకపోయింది.

మొత్తం విలువ గతేడాది కంటే తక్కువ
అక్టోబర్ 1నాటి మెగా స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు ఏడు టెలికం కంపెనీలు రూ.15వేల కోట్లను ధరావతు సొమ్ము (ఈఎండీ) కింద కేంద్రానికి జమ చేసినట్టు తెలుస్తోంది. గతేడాది స్పెక్ట్రమ్ వేలం సమయంలో వచ్చిన ధరావతు సొమ్ము రూ.20,435 కోట్లు కంటే ఇది తక్కువగా ఉండడం గమనార్హం.

వేలం
త్వరలో ప్రారంభం కానున్న వేలంలో రూ.5.63 లక్షల కోట్ల రూపాయల విలువైన రేడియో తరంగాలను కేంద్రం వేలం వేయనుంది. 700, 800, 900, 1,800, 2,100, 2,300 మెగాహెడ్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ను సొంతం చేసుకునేందుకు టెలికం కంపెనీలు పోటీ పడనున్నాయి.

700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్
ఒక్క ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్పైనే రూ.4 లక్షల కోట్ల మేరకు బిడ్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా 700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం బిడ్ దాఖలు చేయాలంటే రూ.5,610 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని జియో మాత్రమే జమ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇదే ప్రధమం
700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది అత్యున్నతమైనది. ఈ బ్యాండ్లో స్పెక్ట్రమ్ వేలం వేయడం దేశంలో ఇదే ప్రధమం. దేశవ్యాప్తంగా 700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ సొంతం చేసుకున్న సంస్థ రూ.57,425 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. జియో మాత్రమే దీని బరిలో నిలిచింది.

ప్రభుత్వం ఆదాయం
అక్టోబర్ 1 నుంచి జరగనున్నస్పెక్ట్రమ్ వేలం ద్వారా రూ.5.63 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా స్పెక్ట్రమ్, ఇతర లెవీల ద్వారా టెలికం శాఖ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.98,995 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది.

బరిలో నిలవని కంపెనీలు
టెలినార్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఈ వేలంలో పాల్గొనడం లేదు. మరి ఎవరు జియోని ఢీ కొడతారా మరెవరు చతికిలబడతారనేది అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వేలం వరకు ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








