అప్పుడు టైటానిక్.. ఇప్పుడు టైటాన్ మినీ జలాంతర్గామి.. అట్లాంటిక్ మహా సముద్రంలో రెండు ఘటనలు తీవ్ర విషాదాంతం..!
ఇంత టెక్నాలజీ యుగంలోనూ మరో తీవ్ర విషాదం నెలకొంది. 1912 సంవత్సరంలో అట్లాంటిక్ మహా సముద్రంలో మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయిన టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు ఐదుగురు యాత్రికులతో వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ (మిని జలాంతర్గామి) సముద్ర గర్భంలో పేలిపోయింది. ఐదుగురు ప్రయాణికులు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటన చేసింది.
అట్లాంటిక్ మహా సముద్రంలో సుమారు 12 వేలకుపైగా అడుగుల లోతు నీటిలో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో కూడిన టైటాన్ సబ్మెర్సిబుల్ జూన్ 18న (ఆదివారం) న్యూఫౌండ్ల్యాండ్ నుంచి బయలుదేరింది. ఈ పర్యటనను ఓషన్గేట్ సంస్థ నిర్వహించింది.

టైటాన్ మినీ జలాంతర్గామిలో ఓషన్గేట్ సంస్థ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, పాకిస్థాన్కు చెందిన బిలియనీర్ హెహజాదా దావుద్, అతని కుమారుడు సులేమాన్, యూఏఈలో నివాసం ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవీ మాజీ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు.

ఈ టైటాన్ మినీ జలాంతర్గామి.. సుమారు 7 గంటల్లోగా తిరిగి రావాల్సి ఉండగా.. ప్రయాణం ప్రారంభించిన కేవలం గంట 45 నిమిషాల వ్యవధిలోనే టైటాన్ సబ్మెర్సిబుల్కు ఉపరితల సహాయక నౌకగా పనిచేసిన కెనడియన్ పరిశోధక నౌక పోలార్ ప్రిన్స్తో కమ్యూనికేషన్ నిలిచిపోయింది. అప్పటి నుంచి సుమారు అమెరికా, కెనెడా కోస్ట్ గార్డ్కు చెందిన రెస్క్యూ టీం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు.

సముద్రంలో సుమారు 10 వేల చదరపు మైళ్ల వరకు ఈ అన్వేషణ కొనసాగింది. భారీ రెస్క్యూ నౌకలు, విమానాలు, ROV (రిమోట్ ఆపరేటెడ్ వెహికల్) లను ఉపయోగించారు. నౌకలు కూడా చేసుకోలేని ప్రాంతాల్లో ROVలను ఉపయోగించారు. ఇవి అధునాతన కెమెరాలను కలిగి ఉన్నాయి. సముద్ర అడుగు భాగాన్ని స్కాన్ చేసేందుకు వీటిని ఉపయోగించారు.
మినీ జలాంతర్గామి కమ్యూనికేషన్ నిలిచిపోయే సమయానికి లోపల ఉన్న ఐదుగురు యాత్రికులకు 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉండేది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 7:15 గంటల వరకు ఆక్సిజన్ సరిపోతుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో పెద్ద ఎత్తున సముద్రంలో జల్లెడ పట్టారు.

చివరకి గురువారం అర్ధరాత్రి అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటన చేసింది. సముద్రగర్భంలో ఉన్న తీవ్రమైన ఒత్తిడి కారణంగా టైటాన్ జలాంతర్గామి పేలిపోయిందని ప్రకటించింది. అందులో ఉన్న ఐదుగురు యాత్రికులు కూడా మరణించారని వెల్లడించింది. రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ (ROV) సాయంతో టైటాన్ సబ్మెర్సిబుల్ (మిని జలాంతర్గామి) శకలాలను గుర్తించినట్లు పేర్కొంది. టైటానికి షిప్ శకలాలకు సుమారు 1600 అడుగులు (488 మీటర్లు) దూరంలో టైటాన్ మిని జలాంతర్గామి శకలాలను గుర్తించినట్లు తెలిపింది.
1912 ఏప్రిల్ 14న టైటానిక్ నౌక తన తొలి ప్రయాణంలోనే సౌతంప్టన్ నుంచి న్యూయార్క్కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలోనే ఓ మంచు కొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. సుమారు 1500లకు పైగా మృతిచెందారు. ఈ ఘటన జరిగి 111 సంవత్సరాలు అయింది. 1985లో టైటానిక్ షిప్ శిథిలాలను కనుగొన్నారు. టైటానిక్ షిప్ రెండు భాగాలుగా విడిపోయింది. ముందు, వెనుక భాగం మధ్య 800 మీటర్లు దూరం ఉంది.


Click it and Unblock the Notifications








