ఓటీపీ అవసరం లేకుండా లావాదేవీలు చేయడం ఎలా ?
ఆన్ లైన్లో షాపింగ్ చేసే సమయంలో కొనుగోలు చేయాలనుకున్నవి మొత్తం సెలక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసే సమయంలో కార్డుతో చేయాలనుకుంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫోన్ దగ్గర లేకుంటే చెల్లింపు ఆలస్యం అవుతుంది. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ బెంగ లేకుండా చెల్లింపుల విధానాన్ని సులభతరం చేసేందుకు వీసా తాజాగా వీసా సేఫ్ క్లిక్ ను ప్రారంభించింది. దీంతో మీకు రెండు దశల నిర్థారణ అవసరం అసలు ఉండదు. ఓటీపీ లేకుండా రూ. 2 వేల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. వీసా సురక్షిత నెట్ వర్క్ ప్రామాణీకరణ పరిష్కారాన్ని వ్యాపారులకు అందిస్తోంది. ఇదిలా ఉంటే ఇండియాలో డిజిటల్ చెల్లింపులు 80 శాతం కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లావాదేవీల చెల్లింపుల విషయంలో కనెక్టివిటీ తప్పు, పాస్ వర్డ్ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ లావాదేవీలు నిర్వహించడానికి చెక్ అవుట్ వేగంగా చేయడానికి తోడ్పడుతుంది. ఇలాంటి పరిష్కారాన్ని ఆవిష్కరించిన మొట్టమొదటి కార్డు వీసా కార్డు అని చెప్పవచ్చు.

ఏటీఎం నుంచి డబ్బులు తీయాలంటే ఓటీపీ కావాల్సిందే
ఏటీఎంలో తరచుగా డబ్బులు తీస్తూ ఉంటారా? అయితే మీకు ఒక అలర్ట్. ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు తీయాలంటే డెబిట్ కార్డు, పిన్ ఉంటే సరిపోదు. వన్ టైమ్ పాస్వర్డ్ కూడా కావాలి. ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ ఈ కొత్త నిబంధనను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. ఏటీఎం వినియోగదారుల భద్రత మేరకు కెనరా బ్యాంకు సరికొత్త రూల్ను అమల్లోకి తీసుకొచ్చింది.

ఓటీపీతో మరింత సురక్షితం
ఒక రోజులో రూ.10వేలు ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధనను ప్రవేశపెట్టింది. కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉప సంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10వేలకు మించి చేసే నగదు విత్ డ్రాయల్స్ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి.

అనధికారిక లావాదేవీలు జరగకుండా..
ఈ అదనపు అథెంటికేషన్ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుందని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ రంగంలోని ఎస్బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే.డెబిట్ కార్డులేకుండానే ‘యోనో యాప్' ద్వారా ఏటీఎం నుంచి నగదుడ్రా చేసుకునేందుకు ఎస్బీఐ సరికొత్త ప్లాన్ తీసుకువచ్చింది.

ప్రస్తుతం కొంతమంది ఖాతాదారులకు మాత్రమే
ఇప్పటి వరకైతే కొంతమంది ఖాతాదారులకు మాత్రమే పరిమితం చేసేనప్పటికీ త్వరలోనే ఖాతాదారులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ. 10 వేల లోపు తీసుకునే వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. కెనరా బ్యాంక్ మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా బ్యాంకులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఏటీఎంలో డెబిట్ కార్డుల ద్వారా క్యాష్ విత్డ్రాయెల్స్ను పూర్తి సురక్షితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఏటీఎం లావాదేవీలపై స్పష్టత
ఇకపోతే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత నెలలో ఏటీఎం లావాదేవీలపై స్పష్టతనిచ్చింది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డబ్బులు లేకపోవడం, పిన్ తప్పుగా ఎంటర్ చేయడం వంటి పలు టెక్నికల్ అంశాల కారణంగా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే దాన్ని లెక్కలోకి తీసుకోవద్దని బ్యాంకులను ఆదేశించింది. అన్ని బ్యాంకులు ఈ నియమ నిబంధనలు పాటించాలని తెలిపింది.


Click it and Unblock the Notifications








