శశిథరూర్కి కౌంటర్ వేసిన టిక్టాక్,మళ్లీ బ్యాన్ డిమాండ్ తెరపైకి
యూజర్ల డేటాను టిక్టాక్ చట్టవిరుద్ధంగా సేకరించి .. చైనాకు పంపుతోందని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యని లోక్సభలో సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చట్టవిరుద్ధంగా యూజర్ల డేటాను సేకరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ ఖండించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొంది.

చైనాకు చెందిన బైట్డ్యాన్స్ సంస్థలో భాగమైన టిక్టాక్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. యూజర్ల డేటా భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించింది.

చైనా టెలికం సంస్థకు ఎలాంటి సంబంధం లేదు
తమపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు చైనాలో లేవని, అక్కడి ప్రభుత్వానికి గానీ చైనా టెలికం సంస్థకు గానీ టిక్టాక్ యూజర్ల డేటా అందుబాటులో ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారతీయ యూజర్ల డేటాను అమెరికా, సింగపూర్లోని ప్రముఖ థర్డ్ పార్టీ డేటా సెంటర్స్లో భద్రపర్చడం జరుగుతుందని టిక్టాక్ తెలిపింది.

చట్టాలకు అనుగుణంగా
టిక్ టాక్ వినియోగంలో ఉన్న ప్రాంతాల్లోని చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పింది. అంతేకాదు తమ నుంచి సమాచారాన్ని సేకరించే వెసులుబాటు చైనా ప్రభుత్వానికి లేదని గుర్తుచేసింది. చైనా టెలికాంకు టిక్టాక్తో ఎలాంటి భాగస్వామ్యం లేదని స్పష్టంచేసింది. అమెరికా, సింగపూర్లోని ఇన్ఫర్మేషన్ సెంటర్లో భారత వినియోగదారుల సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నామని తెలిపింది.

టిక్టాక్పై 5.7 మిలియన్ డాలర్ల జరిమానా
దేశంలో టిక్టాక్ యూజర్లు ఎక్కువే. దాదాపు 200 మిలియన్ వినియోగదారులు టిక్టాక్ యాప్ వాడుతున్నారు. ఇది చైనాకు చెందిన బైట్ డ్యాన్స్కు చెందిన కంపెనీ. చిన్నారులకు సంబంధించి చట్టవిరుద్ధంగా సమాచారం సేకరించినందుకు అమెరికా నియంత్రణ సంస్థలు టిక్టాక్పై 5.7 మిలియన్ డాలర్ల జరిమానా విధించాయనే విషయాన్ని ఈ సందర్భంగా శశిథరూర్ గుర్తుచేశారు.

బ్యాన్ చేయాలని టీడీపీ డిమాండ్
ఇదిలా ఉంటే టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ టిక్ టాక్ గురించి మాట్లాడారు. టిక్ టాక్ లాంటి యాప్ కారణంగా యువత చెడిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దాన్ని బ్యాన్ చేయాలన్నారు. టిక్ టాక్ వల్ల కలుగుతున్న నష్టాలను గల్లా జయదేవ్ లోక్సభలో ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలోనూ టిక్టాక్ను వాడుకున్నారని ఆయన ఆరోపించారు.

కలిగే లాభం కన్నా, నష్టమే ఎక్కువ
ఈ యాప్ మనుషుల ప్రాణాలు తీస్తోంది. కుటుంబంలో కలతలు రేపుతోంది. దీని వల్ల కలిగే లాభం కన్నా, నష్టమే ఎక్కువ. టిక్ టాక్ యాప్ వాడొద్దని చెప్పినందుకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడు టిక్టాక్ లో వీడియో చేయబోయి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇందులో మంచి వీడియోలతో పాటు అసభ్యకరమైన పోస్టులు కూడా పెడుతున్నారు.ఇలాంటి ఘటనలతో యాప్ ని బ్యాన్ చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.

పలు షరతులతో ఆరంగ్రేటం
నిన్నటి వరకు ఫేస్ బుక్, వాట్సాప్లలో గంటలు తరబడి గడిపేవారు ఇప్పుడు టిక్ టాక్ వీడియోలతో కాలం గడిపేస్తున్నారు. కేవలం ఇండియాలోనే 30 కోట్ల మంది టిక్ టాక్ను వినియోగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ల నుండి కొన్ని రోజుల పాటు ఆ అప్లికేషన్ తొలగించారు. దీంతో తమకు రోజుకి 3 కోట్ల 50 లక్షల రూపాయల నష్టం వస్తోందని, టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేయాలని ఆ సంస్థ వాదించింది. ఆ తర్వాత పలు షరతులతో టిక్ టిక్ పై బ్యాన్ ఎత్తివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.


Click it and Unblock the Notifications








