సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్న వారికి సెమి సోమ్నియా అనే నిద్రాభంగ సమస్య వాటిల్లే అవకాశముందని నిపుణులు తాజా అధ్యయనం ద్వారా కనుగొన్నారు. మితిమీరిన సాంకేతిక వినియోగం.. అధిక ఒత్తిడి తదితర కారణాలు ఈ సమస్య భారిన పడేలా చేస్తాయని వారు వివరిస్తున్నారు. అయితే ఇది నిద్రలేమి అంత ప్రమాదకరం కాదని, కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమస్య ఉన్నవారికి ఎంత సేపు పడుకున్నా తగిన విశ్రాంతి లభించదని.. వారి మెదడు ఎప్పుడూ చురుగ్గానే ఉంటుందని లండన్లోని భారత్ సంతతి వైద్యుడు నేరీనా రాం లఖాన్ వెల్లడించారు. నిద్రలేమి వల్ల వచ్చే కుంగుబాటు, అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యలకు వెంటనే దారి తీయకున్నా... సెమి సోమ్నియా వల్ల ఆరోగ్యానికి ఎంతో కొంత ముప్పు ఉంటుందని తెలిపారు. ఈ వివరాలను డెయిలీ మెయిల్ వెల్లడించింది.
ఈ సమస్యతో బాధపడుతున్న 30 వేల మంది పై దాదాప ఐదేళ్ల పాటు అధ్యయనం జరిపామని ఈ సమస్యలకు సాంకేతికత వినియోగమే ప్రధాన కారణమని ఇందులో వెల్లడైందని ‘ది ఎనర్జీ ప్రాజెక్ట్’కు చెందిన పరిశోధకులు తెలిపారు. ఇంటర్నెట్ కనెక్షన్తో కూడిన ల్యాప్టాప్ అలాగే టాబ్లెట్ పీసీలను ఉపయోగిస్తున్నవారు నిద్రపోయే ముందు సైతం ఆన్లైన్ వ్యవహారాల్లో నిమగ్నమవుతున్నారని తాజా అధ్యయనం చెబుతోంది. బ్రిటన్లో 35శాతం మంది ఉద్యోగులు పడక పై కార్యాలయ పనులు చేస్తుండగా... అమెరికాలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న ఉద్యోగుల్లో ప్రతి పది మందిలో 8 మందిది ఇదే ధోరణట. ఇలా పడక గదిలో సాంకేతిక పరికరాలను ఉంచుకోవటం.. పని చేయడం వల్ల భార్యభర్తలు కలిసి గడిపే సమయం తగ్గిపోతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.