మొబైల్ యూజర్లు ఎగిరి గంతేసే వార్త.. మీకు కావాల్సిన వాటికి మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు..!!
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల కాలంలో మొబైల్ యూజర్లకు మేలు జరిగేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. స్పామ్ కాల్స్, మెసేజ్లకు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవలే టెలికాం సంస్థలకు సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంస్థలు స్పామ్ బ్లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
తాజాగా ట్రాయ్ కీలక ఆదేశాలు జారీచేసింది. అన్ని టెలికాం సంస్థలు డేటా ప్రయోజనాలు లేకుండా వాయిస్, SMS లతో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని (STVs for voice and SMS) స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తో పాటు ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేటు సంస్థలకు సంస్థలకు ప్రత్యేక టారిఫ్ వోచర్లు తీసుకురావాలని సూచించింది.

టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తాజా ఆదేశాలతో చాలా మంది యూజర్లకు ఉపయోగం కలగనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులు, ఇంట్లో వైఫై సౌకర్యం ఉన్న వారికి డేటాతో అవసరం ఉండదు. అయితే ప్రస్తుతం డేటా, వాయిస్, కాలింగ్ తోనే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే చాలా మంది యూజర్లు డేటాను వినియోగించడం లేదు. అయినా కూడా బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి వారికి కేవలం వాయిస్, SMS మాత్రమే పొందే విధంగా ప్రత్యేక టారిఫ్ వోచర్లు తీసుకురావడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ట్రాయ్ భావిస్తోంది.

దీంతోపాటు ట్రాయ్ మరిన్ని కీలక సూచనలు చేసింది. STV (స్పెషల్ టారిఫ్ వోచర్లు) మరియు CV (కాంబో వోచర్లు) కాలపరిమితిని 90 నుంచి 365 రోజులకు పెంచాలని టెలికాం సంస్థలకు ట్రాయ్ కోరింది. ఫలితంగా తరచూ రీఛార్జ్లు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చుతుందని ట్రాయ్ అభిప్రాయపడింది.
దీంతోపాటు తక్కువ కాలపరిమితి కలిగిన వోచర్లను కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది. ఇందులో భాగంగా కచ్చితంగా రూ.10 విలువైన వోచర్ను తీసుకురావాలని సూచించింది. అదే సమయంలో టెలికాం సంస్థలు వారికి నచ్చిన డినామినేషన్తో వోచర్లను తీసుకొచ్చే స్వేచ్చను ఇస్తున్నట్లు పేర్కొంది.

ట్రాయ్ తాజా నిర్ణయంతో డ్యూయల్ సిమ్ కార్డులు వినియోగించే యూజర్లకు భారీగా ఉపసమనం కలగనుంది. ప్రస్తుతం రెండు సిమ్ కార్డులను వినియోగిస్తున్న యూజర్లు, రెండో సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచేందుకు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి తక్కువ ధరలో ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.
తాజాగా ట్రాయ్ అక్టోబర్ నెల నివేదికను విడుదల చేస్తోంది. జులైలో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచిన కారణంగా ప్రైవేటు టెలికాం సంస్థలకు యూజర్లు వరుస షాక్లు ఇస్తున్నారు. అయితే అక్టోబర్ నెలలోనూ జియో, వోడాఫోన్ ఐడియా సంస్థలకు యూజర్లకు గుడ్బై చెప్పినట్లు ట్రాయ్ నివేదిక వెల్లడించింది.
అయితే జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో లక్షలాది మంది యూజర్లను కోల్పోయిన ఎయిర్టెల్ మాత్రం అక్టోబర్లో 19.28 లక్షల మంది యూజర్లను సంపాదించుకుంది. గతానికి భిన్నంగా BSNL నెట్వర్క్లోకి జులై నుంచి లక్షలాది మంది యూజర్లు వస్తున్నారు. అక్టోబర్లోనూ 5 లక్షల మంది కొత్త యూజర్లను సంపాదించుకుంది.


Click it and Unblock the Notifications








