డిసెంబర్ 1 నుంచి ఏం జరగనుంది.. OTP లు ఆలస్యం కానున్నాయా.. TRAI ఏం చెబుతోంది..?
భారత్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2024 డిసెంబర్ 1 నుంచి అనేక మంది వినియోగదారులు బ్యాంకింగ్, ఇ-కామర్స్ సహా ఇతర ప్లాట్పాంల నుంచి వచ్చే OTP లను సరైన సమయంలో అందుకోలేరంటూ ప్రచారం జరుగుతోంది. TRAI (టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇటీవల తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఇందుకు కారణమని చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై ట్రాయ్.. తన సోషల్ మీడియా ప్లాట్ఫాం X (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించింది.
ఈ ప్రచారంలో వాస్తవం లేదని.. ప్రజలు ఈ వార్తలను నమ్మవద్దని సూచించింది. టెలికాం సంస్థలకు ఇటీవల జారీచేసిన ట్రేసబిలిటీ (TRAI Traceability Rules) ఆదేశాలు.. OTP లపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది. సోషల్ మీడియా సహా ఆన్లైన్ వేదికల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం భారత్ లో అనేక మంది మొబైల్ ఫోన్ యూజర్లు స్పామ్ కాల్స్, SMS లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ట్రాయ్ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టెలికాం సంస్థలు కూడా వాటి స్థాయిలో స్పామ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టులో టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
సైబర్ నేరాలు సహా ఇతర నేరాలను కట్టడి చేయడంలో భాగంగా ట్రేసబిలిటీపై టెలికాం సంస్థలకు ట్రాయ్ ఇటీవల కీలక ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా బల్క్ SMS లు ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించే విధంగా కీలక సూచనలు చేసింది. ఈ ట్రేసబిలిటీ ఫీచర్ ద్వారా ఈ తరహా స్పామ్ మెసేజ్ లను కట్టడి చేయాలని భావిస్తోంది.

ట్రేసబిలిటీలో భాగంగా యూజర్లకు వచ్చిన ప్రతి SMS ఎక్కడ నుంచి వచ్చిందో టెలికాం సంస్థలు గుర్తించాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి అమలు చేయాలని టెలికాం సంస్థలకు ట్రాయ్ ఆదేశాలను జారీ చేసింది. అయితే కొన్ని కారణాలు సహా టెలికాం సంస్థల విజ్ఞప్తులతో ట్రేసబిలిటీ అమలు నిర్ణయం వాయిదా పడింది.
ట్రాయ్ ఆదేశాలతో డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఫలితంగా స్పామ్ మెసెజ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకొనేందుకు టెలికాం సంస్థలకు అవకాశం కలుగుతుంది. ఇందుకు అవసరమైన సదుపాయాలను టెలికాం సంస్థలు సమకూర్చుకున్నట్లు ట్రాయ్ తెలిపింది.
ట్రేసబిలిటీ కారణంగా OTP లు అందుకొనే యూజర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని TRAI హామీ ఇచ్చింది. ఈ తరహా చర్యలు స్పామ్ కాల్స్, మెసేజ్లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సైబర్ సెక్యూరిటీని మెరుగుపరుస్తుందని భావిస్తోంది.
దేశంలో ట్రేసబిలిటీ నిబంధనలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. టెలికాం సంస్థలు ఈ నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది. అయితే టెలికాం సంస్థలు ఎంత వరకు సిద్ధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది. అయితే సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫాంలో మాత్రం యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications