అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ, ఈ సారి ఆడిటర్ల రూపంలో..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వ్యాపారంలో వరుస నష్టాలు, రుణభారం వెరసి అనిల్ అంబానీ వరుసగా ఆస్తులు, కంపెనీలలో షేర్లను అమ్మకానికి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆడిటర్ల రూపంలో మరో షాక్ తగిలింది. రిలయన్న్ గ్రూపునకు చెందిన అనుబంధ కంపెనీలైన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు చెందిన ఆడిటర్లు రాజీనామా చేశారు.

గత మూడు నెలలుగా చట్టబద్దమైన ఆడిటర్లుగా తప్పు కోవడం పెద్ద దెబ్బ కాగా తాజాగా మరో రెండు కంపెనీల ఆడిటర్లు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు నెలల్లోనే రిలయన్స్ గ్రూప్లోని నాలుగు కంపెనీల ఆడిటర్లు వైదొలిగినట్లు అయింది.

కంపెనీలకు లేఖ రాసిన ఆడిటర్లు
కంపెనీకి చట్టబద్ధమైన ఆడిటర్లలో ఒకరైన బీఎస్ఆర్ అండ్ కం 2019 ఆగస్ట్ 9వ తేదీ నుంచి వైదొలిగిందని రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ సమాచారంలో వెల్లడించాయి. ఈ మేరకు ఆడిటర్లు కంపెనీలకు ఒక లేఖ రాసినట్టు తెలిపాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 14వ తేదీన రిలయన్స్ ఇన్ఫ్రా ఆడిట్ నివేదికలో ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ పైన ఆందోళన వ్యక్తం చేసిందని, తమకు వివిధ అంశాలపై సరైన సమాచారం లభించలేదని కంపెనీ పేర్కొంది.

అన్న ఆకాశానికి తమ్ముడు పాతాళానికి
ఒకవైపు అనిల్ అంబానీ సోదరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పట్టిందల్లా బంగారంలా దూసుకుపోతున్నారు. పెట్రో కెమికల్ బిజినెస్లో 20 శాతం విదేశీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దుబాయ్ కంపెనీసౌదీ అరామ్కో ద్వారా మొత్తం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తన కంపెనీని అప్పుల్లేని కంపెనీగా తీర్చదిద్దుతామని కంపెనీ ఏజీఎం సందర్బంగా ప్రతిష్టాత్మకంగా వెల్లడించారు. మరోవైపు అనిల్ అంబానీ మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నారు.

ఆదుకుంటానని చెప్పిన అన్న
ఇదిలా ఉంటే అప్పుల ఊబిలో చిక్కుకున్న సోదరుడు అనిల్ అంబానీ కంపెనీని వచ్చే ఏడాదిన్నరలో సంస్థను రుణ రహితంగా తీర్చిదిద్దుతామని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు.ఇందుకోసం చమురు, రసాయనాల రంగాల్లో 20% వాటా విక్రయించాలని, పెట్రోలు బంకుల్లో రూ.7000 కోట్లకు 49% వాటా బీపీకి విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సౌదీ సంస్థ అరామ్కోకు రిలయన్స్ చమురు, రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను రూ.1.05 లక్షల కోట్లకు పైగా మొత్తానికి విక్రయించనున్నారు. రిలయన్స్ పెట్రోలు బంకుల విభాగంలో 49 శాతం వాటాను బ్రిటిష్ పెట్రోలియమ్ (బీపీ) రూ.7,000 కోట్లకు కొనుగోలు చేయనుంది.

మరో కంపెనీ వాటాలను అమ్మకానికి
తాజాగా అనిల్ అంబానీకి చెందిన మరో కంపెనీ వాటాలను అమ్మకానికి పెట్టారు. రిలయన్స్ కాపిటల్కు 100 శాతం వాటా కలిగిన రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్సూ (ఆర్ హెచ్ఐ)లో వాటాల విక్రయానికి మూడు కంపెనీలను సంప్రదించింది. ఇందులోని తన మొత్తం వాటాను వచ్చే నెల కల్లా విక్రయించడానికి ఇప్పటికే అజయ్ పిరమల్ గ్రూపు, టివిఎస్ కాపిటల్ ఫండ్స్, ప్రేమ్జీ ఇన్వెస్ట్లో సంప్రదించింది. ఈ లావాదేవీ కోసం గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు మోయిలీస్ అండ్ కంపెనీ సాయం తీసుకుంటుంది. రిలయన్స్ కాపిటల్ ఆస్తుల విక్రయ ప్రణాళి కలో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతుంది.


Click it and Unblock the Notifications








