చైనాపై కత్తి దూసిన అమెరికా, కౌంటర్తో డ్రాగన్ అటాక్
చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్ వేడెక్కింది. చైనాకు అమెరికా దిమ్మతిరిగే ట్రీట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే తేరుకున్న చైనా అదే స్థాయిలో అమెరికాపై చైనా కౌంటర్ వేసింది.
చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్ వేడెక్కింది. చైనాకు అమెరికా దిమ్మతిరిగే ట్రీట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే తేరుకున్న చైనా అదే స్థాయిలో అమెరికాపై చైనా కౌంటర్ వేసింది. ప్రపంచ దేశాల నుంచి మేధో సంపత్తిని తస్కరించి సొమ్ము చేసుకుంటున్న చైనాను శిక్షించి తీరుతామని పదేపదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు డ్రాగన్కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సాలీనా 60 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.90 లక్షల కోట్ల) సుంకాల ప్యాకేజీతో చైనాను చావుదెబ్బ కొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. యుఎస్టిఆర్ 301 కింద ట్రంప్ చైనాపై వాణిజ్య ఆంక్షల ప్యాకేజీని ప్రకటించాలని యోచిస్తున్నట్లు ఆయన సర్కారులోని నలుగురు సీనియర్ అధికారులు ధృవీకరించారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. చైనా ఉత్పత్తులపై ఏటా 30 బిలియన్ డాలర్ల సుంకాలను విధించేందుకు ఉద్దేశించిన ప్యాకేజీని సీనియర్ అధికారులు ఇటీవల ట్రంప్ ముందుంచారని, అయితే ఈ ప్యాకేజీని రెట్టింపు చేయాల్సిందిగా వారిని ఆయన ఆదేశించారని తెలుస్తున్నది.

చైనా చౌక ఉత్పత్తులు..
కాగా చైనా చౌక ఉత్పత్తులు అమెరికాను కలవరపెడుతున్నాయి. అందుకే చైనా ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలకు తెరతీసింది. చైనాతో అమెరికా వాణిజ్య లోటు 370 బిలియన్ డాలర్లకు చేరినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. దీంతో చైనా నుంచి దిగుమతి అవుతున్న 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై పన్నులను సమం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ అధికారులను ఆదేశించారు.

20 లక్షల ఉద్యోగాలు..
కేవలం చైనా దిగుమతుల కారణంగా దేశంలో వేలాది పరిశ్రమలు మూతపడి, 20 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయినట్టు అమెరికా ఆరోపిస్తోంది. చైనా అనైతిక వాణిజ్య విధానాలను అనుసరిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. ప్రతీ బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఫలితం 6,000 ఉద్యోగాల నష్టమని అంచనా వేస్తోంది. ఓ అంచనా మేరకు దీనివల్ల చైనాలో 2 మిలియన్ (20లక్షలు) ఉద్యోగాలు పెరగ్గా, అమెరికాలో ఆ మేరకు తగ్గాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది

అన్ని ఉత్పత్తులపై
చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై భారీ సుంకం వేస్తూ ట్రంప్ తాజా ఆదేశాలు జారీ చేసిన మరుక్షణమే చైనా కూడా దీటుగానే ప్రతిస్పందించేందుకు సిద్దమైంది. అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు చైనాకు వస్తున్నాయి. వీటిలో మాంసం ఉత్పత్తులు, వైన్, సీమ్ లెస్ స్టీల్ ట్యూబులు ఇలా 128 వరకు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిపైనా భారీ పన్నుకు చైనా ప్రణాళిక సిద్ధం చేసుకుంది

టారిఫ్ విషయంలో ..
ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులపై టారిఫ్ విషయంలో చైనా తగ్గింపు విధానాన్ని అనుసరిస్తోంది. పండ్లు, నట్స్, వైన్, తదితర ఉత్పత్తులపై 15 శాతం దిగుమతి పన్ను విధించనున్నట్టు చైనా తెలిపింది. పంది మాంసం, రీసైకిల్ చేసిన అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం పన్ను వేయనుంది.

రెండు దశల్లో..
రెండు దశల్లో ఈ చర్యలను అమలు చేయనున్నట్టు చైనా పేర్కొంది. తొలి దశలో 15 శాతం పన్నును అమలు చేస్తామని, వాణిజ్య అంశాల విషయంలో ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరకపోతే రెండో దశలో 25 శాతం పన్నును ఆచరణలో పెడతామని చైనా తెలిపింది.

వందకుపైగా ఉత్పత్తులకు..
కాగా అమెరికా సంస్థల వ్యాపార రహస్యాలను దొంగిలించి లేదా వాటిని బలవంతంగా స్వాధీనం చేసుకుని చైనా అనేక రకాల వస్తువులను తయారు చేస్తున్నదని ఎప్పటి నుంచో వాదిస్తున్న ట్రంప్.. అటువంటి వందకుపైగా ఉత్పత్తులకు ఈ సుంకాల ప్యాకేజీని వర్తింపజేసే అవకాశమున్నది.

వాణిజ్య యుద్ధం సెగలు ఇంకా చల్లారకుండానే..
ఒకపక్క ఉత్తర కొరియాతో వాణిజ్య యుద్ధం సెగలు ఇంకా చల్లారకుండానే ఇప్పుడు ట్రంప్ చైనాపై కత్తి దూయడం ప్రపంచ మార్కెట్లను వణికిస్తోందని పరిశీలకులంటున్నారు.


Click it and Unblock the Notifications








