సిమ్ స్వాప్ ద్వారా రూ. 3 లక్షల 68 వేలు కాజేశారు
టెక్నాలజీ వాడకం పెరిగిన తరువాత ప్రతీది ఆన్లైన్మయం అయిపోయింది. ఒకప్పుడు నగదు లావాదేవీలు నిర్వహించాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సివచ్చేది. ఖాతాలో డబ్బు వేయాలన్నా.. తీయాలన్నా క్యూలో గంటల తరబడి వే
టెక్నాలజీ వాడకం పెరిగిన తరువాత ప్రతీది ఆన్లైన్మయం అయిపోయింది. ఒకప్పుడు నగదు లావాదేవీలు నిర్వహించాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సివచ్చేది. ఖాతాలో డబ్బు వేయాలన్నా.. తీయాలన్నా క్యూలో గంటల తరబడి వేచి చూడాల్సిందే. కానీ ఇప్పుడు ఆర్థిక లావాదేవీల తీరే మారిపోయింది. బ్యాంకు ఖాతాలో డబ్బు వేయడం.. తీయడం నిమిషాల వ్యవధిలో పూర్తవుతోంది. ఇక్కడి నుంచి ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా సరే డబ్బు పంపించడమూ నిమిషాల్లో చేసేస్తున్నారు.

అయితే ఇదే సాంకేతిక పరిజ్ఞానం కొన్ని సందర్భాల్లో సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మారుతోంది. కళ్లు మూసి తెరిచేలోపు ఖాతాదారులకు తెలియకుండానే రూ.కోట్ల నగదును నేరగాళ్లు కాజేస్తున్నారు. 'సిమ్ స్వాప్’ ద్వారా ఖాతా ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా లేటెస్ట్ స్కాం బయటకొచ్చింది.

హైదరాబాద్ లో ఉద్యోగి
హైదరాబాద్ కు చెందిన సారంగ దీపక్ కూకట్పల్లిలోని ముత్తోజు అండ్ కంపెనీలో టాక్స్ కన్సల్టెంట్గా పనిచేసేవాడు. అతడికి కూకట్పల్లి కోటక్ మహేంద్ర బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండేది. కాగా అనారోగ్యం కారణంగా గత ఏడాది మరణించాడు.

దీపక్ ఖాతాలోని నగదు ఉపసంహరించేందుకు..
అనంతరం అతడి భార్య సంధ్య దీపక్ ఖాతాలోని నగదు విత్ డ్రా బ్యాంకుకు వెళ్లారు. నగదు లావాదేవీలను పరిశీలించగా రూ.3.68 లక్షల నగదు అక్రమంగా వేరే ఖాతాకు బదిలీ అయినట్లు తేలింది. ఈనేపథ్యంలో ఆమె రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇద్దరు కేడీలు..
సైబర్క్రైమ్ ఏసీపీ హరినాథ్ మార్గదర్శకత్వంలో ఇన్స్పెక్టర్ జలంధర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలానగర్ ఐడీపీఎల్ కాలనీ సుమిత్రనగర్కు చెందిన టాక్స్ కన్సల్టెంట్ ముత్తోజు సత్యనారాయణ (48), కూకట్పల్లి పాత రామాలయం రోడ్డులో నివసించే పేరుమల్ల శ్రీదుర్గ కృష్ణప్రసాద్ (36) ఈ డబ్బు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది.

సిమ్ స్వాప్
అత్యాధునిక టెక్నాలజీ అయిన సిమ్ స్వాప్ ద్వారా ఈ డబ్బు కాజేసినట్లు నిందితులు అంగీకరించడంతో వారి నుంచి మొత్తం డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

ఖాతాదారులు అప్రమత్తంగా..
ఈ నేపథ్యంలో ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కేసును పరిశోధించిన ఇన్స్పెక్టర్ జలంధర్రెడ్డి సూచించారు. సామాజిక మాధ్యమ ఖాతాల్లో వ్యక్తిగత వివరాల్ని బహిర్గతం చేయకూడదని, బ్యాంకు ఖాతా రహస్య సంకేతాల్ని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలని సూచించారు.


Click it and Unblock the Notifications








