జూలై 1 నుంచి ఆధార్ ఫేస్ రికగ్నిషన్, అసలేంటిది, మీ కోసం పూర్తి వివరాలు
Unique Identification Authority of India ( UIDAI ) జూలై 21వ తేదీ నుంచి ఆధార్ పక్రియను సరికొత్తగా చేపట్టనుంది.
Unique Identification Authority of India ( UIDAI ) జూలై 21వ తేదీ నుంచి ఆధార్ పక్రియను సరికొత్తగా చేపట్టనుంది. ఈఏడాది జనవరిలో ప్రకటించిన ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ను త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు UIDAI ప్రకటించింది. ఆధార్ పరిశీలన కోసం వేలిముద్రలు, కనుపాపలతో పాటు ముఖ గుర్తింపు సదుపాయన్నీ ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే అధికారికంగా జూలై 1న ఈ ఫీచర్ లాచ్ చేయనున్నామని గత వారం సుప్రీంకోర్టుకు తెలిపారు. వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వంటి సమస్యల వల్ల బయోమెట్రిక్ వివరాల ధృవీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి కోసం ఇలాంటిది తీసుకు వస్తామని జనవరిలోనే యూఐడీఏఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీం కోర్టుకు కూడా ఈ విషయన్ని నివేదించింది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్టైం పాస్వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది.

ఫేస్ రికగ్నిషన్ పని తీరు
యూజర్ల కనుపాపల్ని స్కాన్ చేసినట్లే ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ ధ్రువీకరణ చేస్తారు. అలాగే స్కానింగ్ సమయంలో ముఖ కదలికలు ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సమయంలో నవ్వడం కాని లేకుంటే కనురెప్పలు ఆడించడం కాని చేయాల్సి ఉంటుంది.

ఫేస్ రికగ్నిషన్ ఎందుకు
వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, లేదా వన్టైమ్ పాస్వర్డ్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్కు చాలా సమయం పడుతోంది. పైగా వృద్ధుల వేలిముద్రలు, కనుపాపలను స్కానింగ్ మెషీన్లు కొన్నిసార్లు గుర్తించడం లేదు. అందుకే ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ను తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

దుర్వినియోగానికి అవకాశం ఉందా..?
ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ను దుర్వినియోగం చేసే అవకాశం లేదని యూఐడీఏఐ చెబుతోంది. ఒక్క ఫేస్ రికగ్నిషన్తోనే ఆధార్ ధ్రువీకరణ జరగదు. దానికి అదనంగా వేలిముద్రలో, కనుపాప స్కానింగో, లేదంటే వన్టైమ్ పాస్వర్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది దుర్వినియోగం కాదని యూఐడీఏఐ చెబుతోంది.

మళ్లీ ఆధార్ సెంటర్కి వెళ్లాలా..?
ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ కోసం మళ్లీ ఆధార్ సెంటర్కి వెళ్లి ఫొటోలు దిగాల్సిన పని లేదు. ఇదివరకే ఆధార్ డేటా బేస్లో ఉన్న మీ సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందుకోసం బయోమెట్రిక్ స్కానింగ్ మెషీన్లలో కొన్ని సాంకేతిక మార్పులు చేసే అవకాశం ఉంది.

ఆధార సురక్షితం కాదని..
ఇదిలా ఉంటే ఆధార సురక్షితం కాదని వివాదం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కాగా ఆధార్ డేటా భద్రతపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో యూఐడీఏఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.

ఆధార్ సమాచారం ..
అయితే ఆధార్ సమాచారం అత్యంత సురక్షితమని 'యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)' సీఈవో అజయ్ భూషణ్ పాండే అన్నారు. ఆధార్ సమాచారం కేంద్రంలోని డాటాబేస్కు చేరిందంటే... ఆ సమాచారాన్ని... ఇతరులు తస్కరించడం ఎట్టిపరిస్థితిల్లోనూ కుదరదని చెప్పారు.

తస్కరించాలంటే..
ఆధార్ సమాచారమంతా... 2048-ఎన్క్రిప్షన్ కీ సిస్టమ్లో భద్రంగా ఉందని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే పేర్కొన్నారు. అయితే ఈ సూపర్ కంప్యూటర్ నుంచి ఆధార్ సమాచారాన్ని తస్కరించాలంటే 12 వందల కోట్ల సంవత్సరాలకు పైగా పడుతుందని చెప్పారు.

ఆధార్ సాఫ్ట్వేర్ను ఇంటర్నెట్కు..
ఆధార్ కార్డు జాతీయస్థాయిలో ఎక్కడైనా, దేనికైనా ఉపయోగపడుతుందని... దీనికి ఎలాంటి భాషా పరమైన సమస్యలు కూడా ఎదురుకావని తెలిపారు. ఆధార్ నమోదులో వ్యక్తి ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ మాత్రమే సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఆధార్ సాఫ్ట్వేర్ను తామే అభివృద్ధి చేసినందున ట్యాంపరింగ్కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఆధార్ సాఫ్ట్వేర్ను ఇంటర్నెట్కు అనుసంధానించకపోవడం వల్ల 'హ్యాకింగ్' చేసే అవకాశం కూడా ఉండదని తెలిపారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్..
ఇదిలా ఉంటే ఆధార్ సమాచారం దుర్వినియోగమవుతోందని ప్రచారం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వీసా కోసం విదేశీయుల ముందు దుస్తులు విప్పడానికి సిద్ధపడే భారతీయులు..ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు అడిగితే మాత్రం ప్రైవసీ దెబ్బతింటుందని రాద్ధాంతం చేస్తున్నారని చురకలంటించారు.

అమెరికా వీసా కోసం నేను 10 పేజీల దరఖాస్తును..
అమెరికా వీసా కోసం నేను 10 పేజీల దరఖాస్తును నింపానని.. తెల్లవాడికి మన వేలిముద్రలు ఇవ్వడానికి, వారి ముందు నగ్నంగా నిలబడటానికి మనకేం అభ్యంతరం ఉండదు కానీ.. మన ప్రభుత్వమే పేరు, చిరునామా లాంటి వివరాలు అడిగితే మాత్రం గోప్యతను ఉల్లంఘిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారన్నారు ఆల్ఫోన్స్.


Click it and Unblock the Notifications








