స్పామ్ కాల్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎవరు చేస్తున్నారో తెలిపేలా కొత్త నంబర్లు కేటాయింపు?
ఇటీవల కాలంలో అధిక శాతం మందికి అవసరం లేని కాల్స్ (Spam Calls) ఎక్కువగా వస్తున్నాయి. బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇతర సంస్థలకు సంబంధించిన ప్రొమోషనల్ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ కాల్స్ రోజుకు విసిగించే స్థాయిలో వస్తుంటాయి. మరికొన్ని సార్లు వినియోగదారుల సహనానికి పరీక్ష పెడుతుంటాయి.
అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా ఇతర సంస్థలు ఈ తరహా కాల్స్ నియంత్రణ లేదా వారి వివరాలను వెల్లడించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఈ కాల్స్కు సంబంధించిన మార్గదర్శకాలు (Guidelines To Control Spam Calls) త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) ఈ తరహా కాల్స్ కోసం మార్గదర్శకాలను తయారుచేసినట్లు తెలుస్తోంది. రిజిస్టర్ కాని మరియు అవసరం లేని కాల్స్ ను నియంత్రణకు సంబంధించిన వివరాలను ఇందులో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఇటువంటి స్పామ్ కాల్స్ కొన్ని బ్యాంకులు, జీవిత బీమా సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు సహా ఇతర ప్రమోషనల్ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ తరహా కాల్స్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంస్థలే వీటికి బాధ్యత వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా సంస్థ వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు కూడా విధించనున్నారని తెలుస్తోంది.
ఈ కాల్స్ను గుర్తించేందుకు వీలుగా మూడు వేర్వేరు సర్వీస్ నంబర్ సిరీస్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్ కోసం 111, సర్వీస్ కాల్స్ కోసం 160, మార్కెటింగ్ కాల్స్ కోసం 140 నంబర్ సిరీస్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
టెలికాం మంత్రిత్వ శాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియోషన్ ఆఫ్ ఇండియా సహా ఇతర సంబంధిత సంస్థలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్చల అనంతరం ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది.
వినియోగదారుల రక్షణ చట్టం 2019 లోని సెక్షన్లు 2(28) మరియు 2(47) ప్రకారం ఈ తరహా కాల్స్ తప్పుదారి పట్టించేవిగా పరిగణిస్తాయి. వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా వచ్చే కాల్స్ను ఇవి నియంత్రిస్తాయి. దీంతోపాటు సర్వీస్ ప్రొవైడర్లు కూడా అనైతిక పద్ధతుల ద్వారా వచ్చే కాల్స్ను నియంత్రించనున్నారు.
అయితే ఈ మార్గదర్శకాలను ప్రభుత్వం ఎప్పటి నుంచి తప్పనిసరి చేయనుందో వెల్లడి కాలేదు. దీని ద్వారా స్పామ్ కాల్స్ నుంచి కొంత వరకు ఉపసమనం పొందే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిస్థాయి మార్గదర్శకాల వివరాలు కూడా వెల్లడి కాలేదు. త్వరలోనే వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్బాట్ తెలుగు వెబ్సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








